సిటీబ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): మానసిక ఒత్తిడితో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని, దానికి నివారణ మార్గాలు అత్యసరమని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ అన్నారు. మాసీవ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (మూక్స్) ఫ్లాట్ఫారంపై అభ్యసించడానికి వీలుగా కామన్వెల్త్ ఎడ్యుకేషన్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా(సెమ్కా) న్యూఢిల్లీతో సంయుక్తంగా రూపొందించిన ‘స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సు’ను ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ గురువారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు, కరోనా లాంటి పరిస్థితులు ప్రజలను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. దాని ద్వారా గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు, ఇతర మానసిక రోగాలు వస్తున్నాయన్నారు. ఒత్తిడిని నివారించుకోవడంపై ఈ యూనివర్సిటీలో కోర్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి మరిన్ని నిధుల కేటాయింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లోని అన్ని విభాగాల అధ్యాపకులకు ఈ కోర్సు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థులతో ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ ముచ్చటించారు. కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ ఒక వైపు తమ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే మరో వైపు యూనివర్సిటీలో ఆన్లైన్లో ఈ కోర్సులను చదుకోవచ్చన్నారు.
కార్యక్రమంలో కామన్వెల్త్ ఎడ్యుకేషన్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, డైరెక్టర్ ప్రొఫెసర్ మధు, రిజిస్ట్రార్ డాక్టర్ లక్ష్మారెడ్డి, సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్చార్జ్ డాక్టర్ సరోజ, న్యూఢిల్లీ నుంచి జూమ్ ద్వారా సెమ్కా ప్రతినిధులు పాల్గొన్నారు.