ముంబై, నవంబర్ 3: గతేడాది దీపావళితో మొదలైన సంవత్ 2077.. స్టాక్ మార్కెట్లను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. ఏటా దీపావళికి దేశీయ మార్కెట్లకు కొత్త ఏడాది మొదలవుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారంతో ముగిసిన సంవత్ 2077లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 16,133.94 పాయింట్లు లేదా 36.97 శాతం ఎగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 5,048.95 పాయింట్లు లేదా 39.50 శాతం ఎగబాకింది. కరోనా ఇబ్బందులున్నా.. మదుపరులు కొనుగోళ్లకే పెద్దపీట వేశారు.
నష్టాలతో వీడ్కోలు
సంవత్ 2077కు స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే వీడ్కోలు పలికాయి. బుధవారం కూడా సూచీలు పడిపోయాయి. సెన్సెక్స్ 257.14 పాయింట్లు లేదా 0.43 శాతం దిగజారి 60వేల మార్క్కు దిగువన 59,771.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 59.75 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 17,829.20 వద్ద నిలిచింది. ఈసారి సమావేశంలో కరోనా కాలం ఉద్దీపనలకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ముగింపు పలకనుందన్న అంచనాలు.. భారతీయ మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. సన్ ఫార్మా షేర్ విలువ అత్యధికంగా 3.06 శాతం పడిపోయింది. ఇండస్ఇండ్, కొటక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల షేర్లూ నష్టపోయాయి.
నేడు మూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా మొదలవుతున్న సంవత్ 2078ను పురస్కరించుకుని గురువారం గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లలో జరుగనున్నది. సాయంత్రం 6:15 గంటల నుంచి రాత్రి 7:15 గంటల వరకు దీన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం బలిపాడ్యమి సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో మళ్లీ సోమవారమే తెరుచుకోనున్నాయి.
నెల గరిష్ఠానికి రూపాయి
డాలర్తో పోల్చితే రూపా యి మారకం విలువ దాదాపు నెల రోజుల గరిష్ఠాన్ని తాకింది. వరుసగా ఐదోరోజూ భారతీయ కరెన్సీ లాభపడగా, బుధవారం ఒక్కరోజే 22 పైసలు బలపడింది. 74.46 వద్ద ముగిసింది. దేశీయ ఐపీవోల్లోకి విదేశీ పెట్టుబడుల వరద, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల కలిసొచ్చాయని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు ఈ ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.