Vani Prasad | వర్షపు నీరు వృథా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వర్షపు నీరు ఉపయోగించుకుంటే వరద ముప్పు, నీటి ఎద్దడి సమస్యలను అధిగమించవచ్చన్నారు. పర్యావరణ, భూ ఉపరితల ఉష్ణోగ్రతల పరిరక్షణ, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు తదితర ప్రధాన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. వర్షపు నీటి నిల్వ, వినియోగించుకునే విధానం, టెర్రస్ గార్డెనింగ్ ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడం, టెర్రస్లపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు.
నగరాలు, పట్టణాల్లో భవనాల నిర్మాణాలు పెరగడంతో ఏటా వర్షాకాలంలో కోట్ల నీరు వృథా అవుతుందన్నారు. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనంలో సుమారు లక్ష లీటర్ల నీరు వృథా అవుతుతోందని, రాష్ట్రంలో అన్ని చోట్ల ఇంటి యజమానులు వారి ఇళ్ల రూఫ్టాప్లపై వర్షపు నీటిని ఒడిసిపట్టి నిలువ చేసుకోవడం ద్వారా నిత్యావసర వినియోగం, మొక్కల పెంపకానికి నీరు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర సచివాలయ భవన ప్రాంగణంలో వర్షపు నీరు నిలువ చేసి, వాటిని వినియోగించుకోనే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచన మేరకు సమావేశంలో నిర్ణయించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, సముదాయాల్లో వర్షపు నీరు నిలువ, స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాట్లు, సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలువాలన్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్లతో 390 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తెలిపారు. భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్రంలో ప్రజలందరు ఇండ్లలో ఇంకుడు గుంతలు, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, రూఫ్ గార్డెనింగ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.