హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): విద్యాభ్యాసం కోసం వెళ్లి ఉక్రెయిన్లో చిక్కుకొన్న రాష్ట్ర విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ చొరవతో ఇప్పటికే 53 మంది విద్యార్థులను ఇంటికి చేరారు. మిగతా విద్యార్థులను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. విద్యార్థులను రప్పించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ విద్యార్థులను రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని, అందుకోసం మొత్తం ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అటు.. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల్లో ప్రత్యేక అధికారులను నియమించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కూడా ఢిల్లీలోని తెలంగాణభవన్ అధికారులు, జీఏడీ, రెవెన్యూ తదిత ర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులను ఢిల్లీ లో రిసీవ్ చేసుకొని హైదరాబాద్కు, ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపే యాక్షన్ప్లాన్ను వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ తెలంగాణభవన్లో హెల్ప్లైన్లు ఏ ర్పాటుచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఉక్రెయిన్ నుంచి ఏ ప్రాంతానికి వెళ్తే స్వదేశానికి వచ్చేందుకు అవకాశం ఉన్నదో అధికారులు బాధిత విద్యార్థులకు వివరిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి వారితో టచ్లో ఉంటున్నారు. విద్యార్థులు ఢిల్లీ, ముంబైకి చేరగానే భోజనం, ఇతర వసతులతోపాటు రవాణా సౌకర్యం ఏర్పాటుచేసి ఇంటి కి పంపిస్తున్నారు.
ఇలా మొత్తం 53 మంది తెలంగాణ విద్యార్థులు ఉండగా, ముంబైలో 17 మంది, మిగిలిన వారిని ఢిల్లీలో రిసీవ్ చేసుకొని వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు విమానంలో రప్పించారు. హైదరాబాద్కు చేరుకున్న విద్యార్థులను ఇక్కడి అధికారులు ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకు చేర్చారు. పలు విమానాల ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొంటున్న విద్యార్థులను రాష్ట్రంలోని వారి సొంత ఊరు వరకు ఫ్రీగా చేర్చేలా ప్రత్యేక బస్సులను సిద్ధంగా ఉంచినట్టు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఇంటికి చేరిన ఇద్దరు విద్యార్థినులు
సంతోషంలో తల్లిదండ్రులు
వైద్యవిద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు.. ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకొంటున్నారు. తాజాగా, శంషాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు నిషారాణి, శ్రీనిధి స్వస్థలానికి చేరుకొన్నారు. ఉక్రెయిన్ నుంచి ముంబైకి, అక్కడి నుంచి ఎయిరిండియా విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరారు. విద్యార్థులు వస్తున్న విషయం తెలుసుకొన్న శంషాబాద్వాసులు పెద్దఎత్తున ఎయిర్పోర్టుకు వచ్చి వారికి స్వాగతం పలికారు. నిషారాణి, శ్రీనిధి ఇంటికి చేరటంతో వాళ్ల తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.