హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): రైతులకు కీడు తలపెట్టాలన్న ఢిల్లీ కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధభేరి మోగిస్తున్నది. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు నడుం బిగిస్తున్నది. ఓవైపు ఉత్తరాది రైతులు ఢిల్లీపై పోరును ఉధృతం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కేంద్రంపై తిరుగులే పోరాటానికి సమాయత్తమవుతున్నది. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్రం నిర్ణయాన్ని టీఆర్ఎస్ సర్కారు సీరియస్గా తీసుకున్నది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, రైతులకు మేలు చేసేందుకు ఏ స్థాయికైనా వెళ్లి… ఎంతటి పోరాటమైనా చేయాలని దీక్షపూనింది. రైతుల పట్ల విపక్షాల బాధ్యతారాహిత్యాన్ని, ముఖ్యంగా బీజేపీ సర్కారు రైతుల జీవితాలతో చెలగాటమాడడాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధమవుతున్నది. రైతు సంక్షేమ కోసం నిరంతరం తపించే తెలంగాణ ప్రభుత్వం.. రైతును బలిపీఠంపై ఎక్కిస్తుంటే చూస్తూ ఊరుకుంటుందా? తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ప్రభుత్వం, కేం ద్రం మంటలు పెడుతుంటే ఊరుకుంటుందా?
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏదో ఒక తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను, ప్రజలను దగా చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇప్పుడు రైతులను బలిచేసే కుట్రలకు తెగబడింది. రైతులకు నష్టం రావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంటే.. బీజేపీ మాత్రం అధికారం కోసం కుటిల రాజకీయం చేస్తున్నది. రైతు లక్ష్యంగా బీజేపీ చేస్తున్న విషపుటెత్తుగడలపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతున్నది. రైతుల సంక్షేమం కోసం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. రాజకీయం, పదువులు, అధికారం కోసం ఆలోచించకుండా రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నది.