హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేసుల సంఖ్య, దవాఖానల్లో ఉన్న వసతులు, ఆక్సీజన్, ఔషధాల లభ్యత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 30వరకు సెలవులను పొడిగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొన్నారు. కరోనాతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో వ్యవసాయంపై కూడా మంత్రివర్గం చర్చించనున్నది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పేచీలు, ఎరువుల ధరల అంశం మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు రానున్నది. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలు అనుసరించాల్సిన వైఖరిపై కూడా మంత్రివర్గం చర్చించవచ్చు. వచ్చే కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి ఎక్కువ నిధులు తెచ్చేందుకు కృషి చేయడంతోపాటు పలు పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో వచ్చిన అప్పీళ్లు, స్పౌజ్ కేసులు, ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.