మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో సీఎం కప్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాస్థాయి పోటీల నిర్వహణకు స్టేడియాన్ని రూ.8.30 లక్షలతో ముస్తాబు చేశారు. ప్రభుత్వ నిధులతోపాటు సింగరేణి సంస్థ, బాల్క ఫౌండేషన్ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానంలో ఉదయం, సాయంత్రం నీళ్లు చల్లించారు. బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులకు పర్మినెంట్ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. రెండు బాస్కెట్బాల్ బోర్డులు కొత్తవి పెట్టించారు. స్టేడియంలో, స్టేజీ మీద, బాస్కెల్ బాల్ కోర్టుతోపాటు గ్యాలరీకి మరమ్మతులు చేయించారు. కాగా.. ముగింపు కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, శాట్స్ చైర్మన్ అంజనేయగౌడ్, టీఎస్టీటీసీఎఫ్సీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ హాజరవుతారని ప్రభుత్వ విప్ సుమన్ తెలిపారు.
– మంచిర్యాల, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రూ.8.30 లక్షలతో పనులు
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జిల్లాస్థాయి పోటీలకు ఠాగూర్ స్టేడియంలో రూ.8.30 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతోపాటు సింగరేణి సంస్థ, బాల్క ఫౌండేషన్ సహకారంతో కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రూ.50 వేల విలువ చేసే గ్రేడర్ మిషన్ తీసుకొచ్చి గ్రౌండ్ క్లీన్ చేశారు. సింగరేణి సహకారంతో మూడు రోజులుగా ఉదయం, సాయంత్రం వాటర్ ట్యాంకర్లతో గ్రౌండ్లో నీళ్లు చల్లించారు. బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులకు పర్మినెంట్ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. రెండు బాస్కెట్బాల్ బోర్డులు కొత్తవి పెట్టించారు. స్టేడియంలో, స్టేజీ మీద, బాస్కెల్ బాల్ కోర్టుతోపాటు గ్యాలరీకి మరమ్మతులు చేయించారు. రోజు 40 మంది పీఈటీలు ఈ పోటీలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ పోటీలు జరగనుండగా మొత్తం 11 ఈవెంట్స్లలో 133 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. 18 మండలాల నుంచి వచ్చే క్రీడాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంతోపాటు రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం క్రీడాకారులందరికీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు మంచిర్యాల డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి తెలిపారు.
మంచిర్యాల, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మట్టిలో నుంచి మాణిక్యాలు వస్తాయన్నట్లు.. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించాలి. సత్తా ఉన్న ఆటగాళ్లు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెల్లో ఉన్నా వారికి మెరుగైన వసతులు కల్పించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో సీఎం కప్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీలు సైతం ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మండలస్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీలు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. మండలస్థాయిలో వివిధ విభాగాల్లో జరిగిన పోటీలతోపాటు, బాస్కెట్బాల్, బాక్సింగ్, హ్యాండ్బాల్ పోటీలను నిర్వహించనున్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం
ఈ క్రీడా పోటీలతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశం. ఈ పోటీల కోసం కష్టపడిన సింగరేణి, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ పీఈటీలు, పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు. రామకృష్టాపూర్లోని ఠాగూర్ స్టేడియాన్నీ జిల్లాలోనే అత్యంత ఆధునికమైన స్టేడియంగా తీర్చిదిద్దుతాం. ఎల్లుండి నిర్వహించే ముగింపు ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్, శాట్స్ చైర్మన్ అంజనేయగౌడ్, టీఎస్టీటీసీఎఫ్సీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ హాజరవుతారు. రాష్ట్రస్థాయి క్రీడలు ఏవైనా కొన్ని ఠాగూర్ స్టేడియంలో నిర్వహించాలని వారిని కోరుతాం. రానున్న రోజుల్లో క్రీడాకారులకు మెరుగైన వసతుల కల్పనతోపాటు అన్ని రకాలుగా సహకరిస్తాం. మంచిర్యాల జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్.