శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజాధికాలను నిర్వహిస్తున్నట్లు దేవస్ధాన ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలోని కుమారస్వామికి పంచామృతాభిషేకాలు చేశారు. దీనివలన శత్రుభాదలు, గ్రహపీడలతోపాటు దృష్టి లోపాలు దూరమవుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు.
సంతాన ప్రాప్తి కలుగని దంపతులు కుమారస్వామిని పూజించాలని అన్నారు. శివభక్త గణాలకు అధిపతి అయిన బయలు వీరభద్రునికి సాయంకాలం ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆరుబయట ఆలయంలో క్షేత్రపాలకుడిగా భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి, విశేష పుష్పార్చన తీర్ధప్రసాదాలు అందించారు.
అనంతరం సంధ్యా సమయంలో నంది మండపంలో కొలువైన నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు దేశంలోవుండే ప్రజలు సుఖసంతోషాలతో భాసిల్లాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు.
పంచామృతాలు ఫలోదకాలతోపాటు హరిద్రోదకం, భస్మోదకం, కుంకుమోదకం, గంధోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, సువర్ణోదకం, పుష్పోదకం మరియు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేస్తు పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. తరువాత నూతన వస్ర్తాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యం సమర్పించారు.