HomeNewsSrisailam Brahmotsavalu Grandly Held Pallaki Seva In Srisailam
కన్నుల పండువగా ఆది దంపతుల పల్లకి సేవ
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆదివారం ఆది దంపతులు పుష్ప పల్లకి సేవ నేత్రపర్వంగా సాగింది. భక్తుల జయజయ ధ్వానాలతో శ్రీగిరులు శివన్నామస్మరణతో మార్మోగాయి.
ఉదయం చండీశ్వరపూజ మండపారాధన కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమాలు నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు.
సాయంత్రం హోమాలు అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వేంచేపు చేసి.. అక్కమహాదేవి అలంకార మండపంలో షోడషోపచార పూజలు నిర్వహించారు.
అనంతరం వివిధ రకాలైన ఎర్రబంతి, పచ్చబంతి, చామమంతి, కనకంబరాలు, డచ్ రోస్ అశోక పత్రాలమాలలు, నందివర్ధనం, గరుడ వర్ధనం, కాగడాలు, అస్సెర్ గ్రాస్, గ్లాడియేలస్ మొదలగు పుష్పాలతో అలంకరించిన పుష్ప పల్లకీలో భ్రామరీ సమేత మల్లికార్జునుడు భక్తులను కనువిందు చేశారు.
సాంప్రదాయ మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో గంగాధర మండపం మొదలుకొని నందిమండపం వరకు, నందిమండపం నుంచి క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రుడి వరకు పురవీధుల్లో శోభాయాత్ర జరిగింది.