కోల్కతా: ఐ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎస్డీఎఫ్సీ) బోణీ చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి ఎఫ్సీ 3-1తో తిద్దిమ్ రోడ్ అథ్లెటిక్ యూనియన్ (టీఆర్ఏయూ) ఎఫ్సీపై అద్భుత విజయం సాధించింది. డేవిడ్ మునజ్ (2, 41వ నిమిషం), లూయిస్ ఒగనా (30వ ని) గోల్స్తో విజృంభించి జట్టుకు తొలి విజయాన్ని కట్టబెట్టారు. అకోబిర్ టారెవో (32వ ని) చేసిన ఏకైక గోల్కే ప్రత్యర్థి క్లబ్ పరిమితమై పరాజయాన్ని చవిచూసింది. గత మ్యాచ్లో నెరోకా ఎఫ్సీపై ఓడిన శ్రీనిధి ఎఫ్సీ రెండో పోరులో అద్భుతంగా పుంజుకుంది. ఆరంభం నుంచి శ్రీనిధి ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. రెండో నిమిషంలో డేవిడ్ గోల్తో ఆధిక్యంలోకి తీసుకురాగా.. అర్ధగంట అనంతరం లూయిస్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. 41వ నిమిషంలో మరో గోల్తో డేవిడ్ ప్రత్యర్థి జట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. అయితే 32వ నిమిషంలో అకోబిర్ చేసిన ఏకైక గోల్కే పరిమితమైన టీఆర్ఏయూ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. మూడు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న శ్రీనిధి తర్వాతి మ్యాచ్లో మొహమ్మదీన్ స్పోర్టింగ్ క్లబ్తో తలపడనుంది.