జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. అంతలోనే యాదరుషి పాత్ర ప్రవేశిస్తుంది. యాదర్షి తపస్సు, నారసింహావతార రహస్యం గురించి త్రిభువన మల్లుడికి వివరిస్తాడు విజ్ఞానేశ్వరుడు .
“మహానుభావా, విజ్ఞానేశ్వరా! నరసింహుడిని నమ్మినవారికి ఓటమి అనేదే ఉండదనీ, ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధిస్తారని మీరు అన్నారు కదా! మరి భువనగిరీశుడు మన ప్రభువులవారు స్వామి సేవకోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. కనులు తెరిస్తే ‘నమో నారసింహా’, కనులు మూసుకుంటే ‘నమో నారసింహా’ అంటారు. మహర్షి యాదర్షి తపఃఫలంగా వెలసిన శ్రీనరసింహవారి పుణ్యక్షేత్రాన్ని పదిమందికీ దర్శనీయ స్థలంగా, పవిత్ర ఆలయంగా తీర్చిదిద్దాలని ఎన్నో ప్రణాళికలు రచిస్తున్నారు. మరి వారు ఈ అపజయ వార్త వినవలసి రావడమేమిటి?”
సూటిగా ప్రశ్నించింది మహారాణి చంద్రలేఖ.
త్రిభువనమల్లుడికి ఇటువంటి సందేహం రాలేదు కానీ, ఎందుకో చంద్రలేఖ వాదనలో నిజమున్నదేమో అనిపిస్తున్నది.
మహారాణీ వారి ప్రశ్న విని, నవ్వాడు విజ్ఞానేశ్వరుడు.
“అమ్మా! నీ ఆవేదనకు కొంత అర్థమున్నది. పరమాత్ముని నిర్ణయంలోని పరమార్థం మనం తెలుసుకోలేము. మనకు ఓటమి ఇంకా రాలేదు. వచ్చినా అది శాశ్వతం కాదు. రాబోయే ఘనవిజయానికి ఇదో ముందస్తు సంకేతం లాంటి హెచ్చరిక కావచ్చు. భగవంతుడు మనల్ని పరీక్షిస్తాడన్నది వాస్తవం. అలా అని చెప్పి మనం భగవంతుడిని పరీక్షించలేము. కూడదు. సాధ్యం కూడా కాదు” వివరించాడు విజ్ఞానేశ్వరుడు.
త్రిభువనమల్లుడికి ఒక ఆలోచన కలిగింది.
ఒకవేళ తాను యుద్ధరంగంలోకి అడుగుపెట్టి స్వయంగా సారథ్యం వహించినా, ఎదిరి పక్షం సైనికశక్తి ముందు అది నిష్ఫలం అవుతుందని అంటున్నాడు అనంతపాలుడు. అది నిజం కాదని, నిరూపించవలసిన అవసరం తనకుంది.
గెలిస్తే, రాజ్యపాలన సుస్థిరమవుతుంది. ఓడిపోతానేమో అనే అనుమానంతో ఏ పనీ చేయకూడదు.
“మహారాణీ చంద్రలేఖా! ఒకటి మాత్రం వాస్తవం. మనం పరీక్షలకు తట్టుకొని నిలబడే శక్తిని సంపాదించుకోవాలి. కానీ, దేవుడికే పరీక్ష పెట్టేంత సాహసం చేయకూడదు. నమ్మిన దైవానికి సేవచేయడం, ఎన్ని కష్టనష్టాలు వచ్చినా అది పూర్తి ఇష్టంతో చేసేది, అందులో మనస్తాపానికి అవకాశం లేదు. నేను ఏం చేయాలో అది చేయక తప్పదు. సమయాసమయాలు, సందర్భం, అసందర్భం గెలుస్తామా, ఓడిపోతామా అన్న సందేహాలు, ఇప్పుడు అవసరం లేదు. గెలిస్తే విజయం. ఓడిపోతే వీరస్వర్గం అని పెద్దలన్నారు. ఇక తప్పదు రణం. తీర్చుకోక తప్పదు పుట్టినగడ్డతో మనకున్న రుణం! జయ నారసింహా, జయహో నారసింహా!” దృఢ నిశ్చయంతో పలికాడు త్రిభువనుడు.
విజ్ఞానేశ్వరుడికి ప్రభువుల వారి అంతరంగం అర్థమయింది. యుద్ధంలో రాణించాలంటే తెగింపు కావాలి. తనపైన తనకు పరిపూర్ణ విశ్వాసం కావాలి. దానికిమించి దైవబలం తోడుకావాలి.
“ప్రభూ! మీ సత్వర స్పందన, దృఢనిశ్చయం బహుధా ప్రశంసనీయం. కానీ, మన సైనిక అధికారులు చెబుతున్న దానినిబట్టి శత్రుపక్షం వారి శక్తియుక్తులు ఎక్కువనీ, మనం తట్టుకోలేమనీ అంటున్నారు. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ, అతి విశ్వాసం తప్పేమో అనే భావన కలుగుతున్నది” చంద్రలేఖ ఆపైన చెప్పలేక ఆగింది.
ఆ మాటకు కోపం వచ్చింది ప్రభువుల వారికి.
“ఇది ధిక్కారం, క్షమార్హం కాదు” అన్నాడు కోపంగా.
త్రిభువనమల్ల చక్రవర్తి కోపంతో పలికిన ఆ మాటలతో, అక్కడి వాతావరణం ఉద్విగ్నభరితంగా తయారయింది.
“ధిక్కారం” అన్న పదం పాలకుడి నోటివెంట వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో, అక్కడున్న అందరికీ తెలుసు.
మహారాణి చంద్రలేఖకు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది.
“ప్రభూ! నా ఉద్దేశం అది కాదు. తమరు స్వయంగా యుద్ధరంగానికి తరలి వెళ్తే, తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతాయో తలుచుకుంటేనే భయం కలుగుతున్నది. మీరు దేశాన్ని ఏలే సార్వభౌములయినా, నాకు మీరు పతిదేవులు. నా పతిదేవుని క్షేమం కోసం నేను దేవుణ్నయినా ఎదిరిస్తాను. ఆ ఉద్వేగంలో నేను హద్దుమీరి మాట్లాడితే మన్నించండి..”
దాదాపు కన్నీటి పర్యంతమైంది మహారాణి.
అయినా చలించలేదు త్రిభువనుడు.
“మహారాణీ! మాకు నచ్చని, మేము మెచ్చని మాటలు ఎవరు చేసినా, నేను ధిక్కారంగానే భావిస్తాను. నా భక్తినీ, శక్తినీ ఎవరు శంకించినా, మేము సహింపము. అది అనంతపాలుడైనా సరే, ఆంతరంగికులైనా సరే!”
అంటూనే విజ్ఞానేశ్వరుడికేసి చూశాడు.
“విజ్ఞానేశ్వరా! మేము తక్షణమే యుద్ధరంగంలోకి వెళ్తున్నాం. అనంతపాల సేనాని అందుబాటులో లేడు కనుక, ఇతర సైన్యాధికారులకు మా ఆదేశంగా చెప్పండి. అన్ని శక్తియుక్తులనూ కూడదీసుకొని శ్రమించమని చెప్పండి..”
ఆ ఆదేశాలు అంచెలంచెలుగా వివిధ దళాధిపతులకు చేరుకున్నాయి.
మొత్తానికి త్వరితగతిన భువనగిరి సామ్రాజ్యంపైన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఎంతో పటిష్ఠం, సుస్థిరం అనుకున్న రక్షణ వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లకు లోనైంది.
త్రిభువనమల్లుడు యుద్ధరంగానికి బయలుదేరక ముందే, నలువైపుల నుంచి ఆందోళనకరమైన వార్తలే వస్తున్నాయి.
విష్ణువర్ధనుడు రోజురోజుకూ తన బలాన్ని, బలగాలను పెంచుకుంటూ పోతున్నాడు.
మహారాణి చంద్రలేఖ, అందరిముందూ త్రిభువనమల్లుడు “ధిక్కారం సహించను” అన్న మాటలను మాటిమాటికీ గుర్తుచేసుకుంటూ బాధపడుతున్నది.
విద్యాపతి వంటి కవిపండితులు, ప్రధాన సలహాదారులు ప్రభువులకు ఎదురు చెప్పలేక, జరుగుతున్న పరిణామాలను మౌనంగా గమనిస్తున్నారు.
చివరికి త్రిభువనమల్లుడికి అవమానకరమైన పరాజయం తప్పదని ఇతరులే కాదు, స్వపక్షంలోనే అనుకోవడం మొదలుపెట్టారు.
ఏది ఏమైనా కాలయంత్రం ఎవరికోసం ఆగదు. ఎవరి నియమాలకు లోబడి పనిచేయదు.
వేగంగా మారుతున్న పరిణామాలను గమనిస్తున్నాడు త్రిభువనమల్ల చక్రవర్తి.
తాను చేయవలసింది యుద్ధమేననీ, ఆ తదుపరి పరిణామాలు తన నియంత్రణలో ఉండకపోవచ్చని అర్థమవుతున్నది.
కానీ, సంకేతాలు, సందేహాలు ఒకదానిపైన ఒకటిగా అందుతూనే ఉన్నాయి.
పది రోజులు గడిచేటప్పటికీ పరిస్థితులు పట్టుతప్పి పూర్తిగా మారిపోయాయి.
అయితే,
త్రిభువనమల్లుడు ఒక్కటే తలచాడు.
తనలో శక్తి ఉన్నంతవరకూ, అంటే ఆఖరి రక్తపుబొట్టు వరకు, యుద్ధరంగంలోనే ఉంటూ, సారథ్యం వహిస్తూ, స్వయంగా పోరాడుతూ ఉండాలని, సైనిక ైస్థెర్యాన్ని పెంపొందించాలని ఆయన తలచాడు.
కానీ, దేవుడు ఇంకోలా తలచాడు.
విష్ణువర్ధనుడి శిబిరం… చాలా కోలాహలంగా ఉంది.
ఒకరకంగా చెప్పాలంటే మంచి ఉత్సాహకర వాతావరణం ఏర్పడి ఉంది.
మంత్రులు, సేనాధిపతులు, దండనాయకులు, యుద్ధ నిపుణులు అందరూ ఆ శిబిరంలో కొలువుదీరి ఉన్నారు.
అందరికేసి చూశాడు విష్ణువర్ధనుడు.
అందరి ముఖాల్లో విజయగర్వం, సంతోషం, సంరంభం కనిపిస్తూ ఉన్నాయి.
విష్ణువర్ధనుడి కంఠం ఖంగున మోగింది.
“హోయసల సామ్రాజ్య హితైషులారా, ఈ రోజు చాలా మంచిరోజు. మనం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. భువనగిరి సామ్రాజ్యాన్ని జయించాలని, మనతో కలుపుకోవాలని. కానీ, ఇప్పటిదాకా ఎంత శక్తి ఉన్నా మనకు సమయం కలిసిరాలేదు. కానీ, ఇప్పుడు మనం వారి సరిహద్దు రక్షణ దుర్గాలను నేలమట్టం చేశాం. మహామహా శక్తిమంతుడూ, అరివీర భయంకరుడూ అని డప్పులు కొట్టించుకున్న అనంతపాలుడిని యుద్ధ నైపుణ్యాల చదరంగంలో ఎటూ కదలకుండా, మెదలకుండా బంధించగలిగాం. ఇప్పుడు త్రిభువనమల్లుడు, అతగాడి సైనిక బలగాలు మనపేరు చెప్తేనే గజగజలాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సమయం మనచేతిలోకి వచ్చింది. ఇక ఇప్పుడు మనం వాళ్లను ఒక్క ఆట ఆడిస్తాం…” ఒక్కపెట్టున నవ్వాడు. అయితే ఆ శిబిరంలోనే ఉన్న ఒక వృద్ధమంత్రికి ఇతగాడి అహంకార ధోరణి చికాకు తెప్పించింది.
మనకు సమయం రావడం కాదు, త్రిభువనమల్లుడు దేశభక్తి, దైవభక్తి వంటి కార్యాలలో లీనమై ఉండి సమయం లేక, సరిహద్దు యుద్ధ ప్రణాళికకు తగిన సమయం ఇవ్వలేక, ఏదో అనుకోకుండా ఓ చిన్నపాటి దుర్గాన్ని మనం కూల్చగలిగాం కానీ, మనకు శక్తి ఎక్కువై కాదు.
తిరుగులేని విజేతగా నిలిచినవాడికి అహంకారం కూడా ఒక అలంకారం అవుతుంది.
ఏదో, అమాసకు పున్నానికీ ఒకచిన్న గెలుపు అనుకోకుండా పొందిన వాడికి అహంకారం కొరివికారం అవుతుంది.
“ఇంత అవసరమా ప్రభూ మనకు?” లోపల అనుకుంటున్నాను అనుకుంటూనే బయటికి అనేశాడు.
వినేశాడు విష్ణువర్ధనుడు. అది గమనించాడు మరొక మంత్రి.
“ఏమిటి వృద్ధామాత్యా! ఏదో పలవరిస్తున్నారు. ప్రకాశంగా అంటే పదిమందీ వింటారు కదా…” వ్యంగ్యంగా అడిగాడు యువమంత్రి.
ఉలిక్కిపడ్డాడు వృద్ధమంత్రి.
“అహహ, అదేం లేదు మిత్రమా, ప్రభువులవారు విజయోత్సాహంలో ఉన్నారు. సమయం మన పక్షాన ఉంది. అవసరమా ప్రభూ, అంటే ఇంత చర్చ అవసరమా ప్రభూ అని! వెంటనే పూర్తి కార్యాచరణలోకి దిగిపోయి, శత్రురాజు గుండెల్లో శూలం దించి… కాలం మనదీ, భళిరా భళీ, అనవలసిన సమయం కదా ఇది అని నా భావన! ప్రభువుల దృష్టికి తీసుకువెళ్లాలని ఇలా పలవరించాను. ఛఛ మన్నించాలి. ఇలా వ్యక్తీకరించాను” అన్నాడా వృద్ధుడు.
“సరే మరి, మనం వెంటనే చేయవలసిన పని ఒకటుంది సేనాధిపతీ. భువనగిరికి గూఢచారిగా వెళ్లిన మన రహస్య దళపతి ఏమయ్యాడు? ఏమి వార్త మోసుకువచ్చాడు?” అడిగాడు విష్ణువర్ధనుడు.
సేనాధిపతి సవినయంగా లేచి, అభివాదం చేసి, తల నేలకి వాల్చి చెప్పాడు.
“ప్రభూ! ఇప్పుడే తమ సమక్షానికి చేరుకుంటానని మన రహస్య వార్తాహరుడు వర్తమానం పంపించాడు” అని అంటూ ఉండగానే…
ఒక సైనికుడు వచ్చి అభివాదం చేసి చెప్పాడు.
“జయము జయము ప్రభూ, తమరిని అత్యవసరంగా కలవాలని ఒక శ్రీమంతుడు వేచి ఉన్నాడు. తమరు అనుమతి ఇస్తే…”
“ఆ శ్రీమంతుడెవరో తక్షణమే ప్రవేశపెట్టు” అన్నాడు విష్ణువర్ధన మహారాజు.
శిబిరం అంతా గుసగుసలు మొదలయ్యాయి.
‘ఎవరీ శ్రీమంతుడు? ఆకస్మికంగా ప్రభువును కలవాలని ఎందుకు వచ్చాడు?’
ఎవరికీ అర్థం కాలేదు.
“సరే, ప్రవేశపెట్టు” ఆజ్ఞాపించాడు విష్ణువర్ధనుడు.
తక్షణమే శిబిరంలోకి ప్రవేశించాడు ఒక స్థూలకాయుడు. వస్తూనే పడిపడి దండాలు పెట్టాడు.
“ఎవరు నవ్వు?” అడిగాడు విష్ణువర్ధనుడు.
“ప్రణామాలు ప్రభూ! నేను…” అతను చెప్పబోతుండగా సైన్యాధిపతి అడ్డుపడి…
“ప్రభూ! ఇతడే మన రహస్య వార్తాహరుడు. భువనగిరిలో మన తరఫున రహస్య సమాచారం సేకరించి ఇప్పుడే వస్తున్నాడు..”
భయంభయంగా చూస్తున్నాడు ఆ రహస్య గూఢచారి.
“సమాచారం ఏమిటి?” అడిగాడు విష్ణువర్ధనుడు.
అతను ఒక్కపెట్టున ఏడుపు లంకించుకున్నాడు. తల విదుపుల్లో తలపాగా ఊడి కిందపడింది. తలమీద గాయం కనిపిస్తున్నది.
“ప్రభూ! వస్తూ ఉండగా, ఒక సింహం దాడిచేసింది…”
వణికిపోతున్నాడు అతను.
“అమ్మా! నీ ఆవేదనకు కొంత అర్థమున్నది. పరమాత్ముని నిర్ణయంలోని పరమార్థం మనం తెలుసుకోలేము. మనకు ఓటమి ఇంకా రాలేదు. వచ్చినా అది శాశ్వతం కాదు. రాబోయే ఘనవిజయానికి ఇదో ముందస్తు సంకేతం లాంటి హెచ్చరిక కావచ్చు. భగవంతుడు మనల్ని పరీక్షిస్తాడన్నది వాస్తవం. అలా అని చెప్పి మనం భగవంతుడిని పరీక్షించలేము. కూడదు. సాధ్యం కూడా కాదు”
వివరించాడు విజ్ఞానేశ్వరుడు. త్రిభువనమల్లుడికి ఒక ఆలోచన
కలిగింది. ఒకవేళ తాను యుద్ధరంగంలోకి అడుగుపెట్టి స్వయంగా సారథ్యం వహించినా, ఎదిరి పక్షం సైనికశక్తి ముందు అది
నిష్ఫలం అవుతుందని అంటున్నాడు అనంతపాలుడు. అది నిజం కాదని, నిరూపించవలసిన అవసరం తనకుంది.
గెలిస్తే, రాజ్యపాలన సుస్థిరమవుతుంది. ఓడిపోతానేమో అనే
అనుమానంతో ఏ పనీ చేయకూడదు.
మనకు సమయం రావడం కాదు, త్రిభువనమల్లుడు దేశభక్తి,
దైవభక్తి వంటి కార్యాలలో
లీనమై ఉండి సమయం లేక,
సరిహద్దు యుద్ధ ప్రణాళికకు తగిన సమయం ఇవ్వలేక,
ఏదో అనుకోకుండా ఓ
చిన్నపాటి దుర్గాన్ని మనం
కూల్చగలిగాం కానీ, మనకు
శక్తి ఎక్కువై కాదు.
(మిగతా వచ్చేవారం)
అల్లాణి శ్రీధర్
allanisreedharthewriter@gmail.com