Pakistan Army : పాకిస్తాన్ ఆర్మీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సైనికులతో ప్రయాణిస్తున్న ఎం17 అనే పాక్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న సైనికులు, సిబ్బంది సహా మొత్తం మంది మరణించారని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఎవరూ బతికిలేరని తెలిపింది. ఈ ఘటన బుధవారం ఉదయం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని ముజఫ్ఫరాబాద్ సమీపంలోని, నీలమ్ వ్యాలీలో జరిగింది. హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక సమస్య కారణంగా కూలిపోయిందని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.
ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. కానీ, అప్పటికే అక్కడ అందరూ మరణించారు. అనంతరం మంటలను సిబ్బంది ఆర్పేశారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తెలిపింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో 20 మంది సైనికులు, సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది. అయితే, దీనిపై పాక్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. రెండు రోజుల క్రితం పాకిస్తాన్కు చెందిన మరో హెలికాప్టర్ కూలిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్కు చెందిన ఆర్మీ హెలికాప్టర్ బలూచిస్తాన్లో కూలింది. తాజాగా హెలికాప్టర్ కూలిన ఘటనపై పాక్ సైన్యం విచారణ జరుపుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అండ్ చీఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో పది మందికిపైగా మరణించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఆర్మీకి, నిరసనకారులకు మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో 30 మంది మరణించగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఇంకా ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.