లక్నో: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Kerala Governor Mohammad Khan) కాన్వాయ్లోకి ఒక కారు వేగంగా దూసుకెళ్లింది. రెండుసార్లు ఇలా జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కారులో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శుక్రవారం నోయిడాలోని సెక్టార్ 77లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి వేళ కాన్వాయ్లో నోయిడా నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు.
కాగా, నల్ల రంగులో ఉన్న స్కార్పియో కారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది. ఇలా రెండుసార్లు జరిగింది. అలెర్ట్ అయిన పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను ఘజియాబాద్కు చెందిన గౌరవ్ సోలంకి, మోను కుమార్గా గుర్తించారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.