పెద్దపల్లి, జనవరి 10 : సంక్రాంతి సందర్భంగా రైల్వే శాఖ తెలంగాణలో ప్రత్యేక రైళ్లేవీ నడపటం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుంచి పండుగ సందర్భంగా వేసిన ప్రత్యేక రైళ్లన్నీ ఆంధ్రా ప్రాంతానికే నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లోనే ఉన్నా తెలంగాణ ప్రాంతంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, బోధన్, బాసర, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, మణుగూరుకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ నుంచి ఒక్కటంటే ఒక్క ప్రత్యేక రైలు వేయలేదు. ఇప్పటికే ‘సంక్రాంతి పండుగ’, ‘ప్రత్యేక రైళ్ల’ పేరిట హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, గూడూరు, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడకు రైళ్లను నడుపుతున్నారు. అందులో కొన్నింటికి రాష్ట్రంలో పలు స్టేషన్లలో హాల్టింగే లేదు. ఇక ఉత్తర తెలంగాణలోని ప్రధాన జిల్లాల మీదుగా వెళ్లే సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్నగర్ మార్గంలో ఒక్క రైలు కూడా వేయలేదు.
మూడు రైళ్లలో సాధారణ కోచ్లు..
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ లైన్లలో ప్రత్యేక రైలు వేయని రైల్వేశాఖ.. భాగ్యనగర్, ఇంటర్సిటీ, సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ల్లోని పలు రిజర్వేషన్ కోచ్లను సాధారణ కోచ్లుగా మార్చి చేతులు దులుపుకొన్నది. 17233/34 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లోని డీ9, డీ10, డీ11, డీ12 కోచ్లు అన్ రిజర్వుడ్ కోచ్లుగా మార్చారు. ఇందులో
సాధారణ టికెట్ తీసుకొని ప్రయాణం చేయవచ్చు. 17012/11హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులోని డీ10, డీ11, డీ12, డీ13 రిజర్వేషన్ కోచ్లను అన్రిజర్వుడ్గా మార్చారు. 12757/58 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులోని డీ16, డీ17, డీ18, డీ19 రిజర్వేషన్ కోచ్లను అన్రిజర్వుడ్గా మార్చి సాధారణ ప్రయాణానికి వీలు కల్పించినా.. ప్రత్యేక రైళ్లు వేయకపోవడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
శబరిమల భక్తులకు నిరాశే..
పండుగ రైళ్లపై వివక్ష శబరిమల భక్తులపైనా కనిపిస్తున్నది. ఏటా కరీంనగర్, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొల్లం జంక్షన్ వరకు శభరిమల భక్తుల కోసం రోజూ రెండు ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను నడిపేవారు. ఈసారి అది కూడా చేయలేదు. అదే కాకినాడ నుంచి కొల్లం, విశాఖపట్నం- కొల్లం, విజయవాడ-కొల్లం జంక్షన్ దాకా ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుపుతున్నారు. దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లోనే ఉన్నది. అయినప్పటికీ ఈ జోన్లో పని చేసే ఆంధ్రా అధికారులు కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రైల్వే సేవలను ప్రజలకు దూరంచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయం లేదన్న కుంటిసాకులతో రైళ్లను వేసినట్టే వేసి రద్దు చేస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు.