తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. భారీ వర్షాల కారణంగా శ్రీవారిని దర్శించుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పిస్తున్నది. దర్శన టికెట్లు ఉండి.. ఈ నెల 18 నుంచి 30 తేదీల్లో స్వామి వారి దర్శనానికి రాలేని భక్తులు.. వచ్చే ఆరు నెలల్లో వీలైన సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు వెలుసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారంతా మళ్లీ దర్శన స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తిరుమలలో అధిక వర్షాపాతం నమోదైనా ఒకటి, రెండు ప్రదేశాలు మినహా పెద్దగా నష్టం వాటిళ్లలేదని తిరుమల చక్కగా ఉందని, భక్తులు నిర్భయంగా వచ్చి స్వామివారి దర్శించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే ఘాట్ రోడ్లకు 13 చోట్ల వర్షానికి భూమి నాని వదులుకావడంతో రక్షణ గోడలు జారి రోడ్డుకు అడ్డంగా పడ్డాయని తెలిపారు.
పలు చోట్ల చెట్ల కూలాయని, వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన తొలగించామని, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. తిరుమల నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డులోనూ ఎలాంటి సమస్య లేదన్నారు. ఈ రెండు ఘాట్ రోడ్లలో నాలుగు రోజుల నుంచి వాహనాలు చక్కగా ప్రయాణిస్తున్నాయని, భక్తులు నిస్సంకోచంగా స్వామివారి దర్శనానికి రావచ్చన్నారు.