శ్రీశైలం : అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి అమావాస్య ఆదివారం ప్రదోషకాలంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ కేఎస్ రామారావు ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు కొనసాగాయి. ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడంతో భూతప్రేత పిశాచ, దుష్ట గ్రహదోషాలు తొలిగి సర్వకార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రయ్య తెలిపారు.
కొవిడ్ కారణంగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోలేక దేశ విదేశాల్లోని భక్తుల అభ్యర్థన మేరకు నిర్వహిస్తున్న పరోక్ష సేవ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుందని ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఇప్పటి వరకు స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలలో ప్రధానంగా 10 సేవలను పరోక్షంగా భక్తులకు అందిస్తుండగా 11వ సేవగా జరుగుతున్న వీరభద్రుని అమావాస్య అభిషేకార్చనకు 689 మంది సేవాకర్తలు, మిగతా పరోక్ష సేవల్లో 463 మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రవాస భారతీయుల నుంచి కూడా విశేష స్పందన రావడం శుభదాయకమని అన్నారు. పరోక్ష సేవలలో పాల్గొనేందుకు srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్కుమార్ తెలిపారు.