శ్రీశైలం : అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మంగళవారం అమావాస్య పురస్కరించుకొని ప్రదోషకాలంలో బయలు వీరభద్ర స్వామికి విశేష పూజలు చేశారు. పరోక్ష సేవ ద్వారా 223 మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో లవన్న మాట్లాడుతూ పరోక్ష సేవలకు తెలుగు రాష్ట్రాలతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు సింగపూర్, అమెరికా, ఇంగ్లాండ్ నుంచి భక్తులు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. సాయంత్రం 6.15గంటలకు పూజలు ప్రారంభం కాగా.. మొదట మహా గణపతిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా బయలు వీరభద్రుడికి పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారి ఆరాధనతో గ్రహదోహాలు, అరిష్టాలు తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కారమవుతాయని, కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. బయలు వీరభద్రుడికి నిత్య పూజలతో పాటు లోక కల్యాణార్థం దేవస్థానం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తూ వస్తోంది. అమావాస్య రోజు జరిగే పరోక్ష సేవలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు దేవస్థానం వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో లవన్న కోరారు.