శ్రీశైలం : అమావాస్య సందర్భంగా శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు చేపట్టారు. ఈఓ ఈవో లవన్న ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి. ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే వీరభద్రుడిని పూజించడంతో భూతప్రేత పిశాచ దుష్ట గ్రహదోషాలు తొలిగి సర్వకార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రయ్య తెలిపారు. ప్రతి అమావాస్య సాయంకాలం అభిషేక కార్యక్రమంలో గోత్రనామాలతో అర్చన పరోక్ష సేవలో పాల్గొనేందుకు భక్తులు srisailadevasthanam.org వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఈఓ కోరారు.