షాబాద్ : తెలంగాణ ప్రభుత్వ హయంలో కొత్తగా ఏర్పడిన పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చిన్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన జాబ్మేళాలో పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చటానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ, ఫ్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టిన్నట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 50వేల ఉద్యోగాల భర్తికీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఫ్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 15వేలకు పైగా వచ్చిన కంపెనీల్లో సుమారు 15లక్షలకు పై చిలుకు మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున ప్రపంచస్థాయి సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగిందన్నారు.
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు ఉపాధికి సంబంధించి జాబ్మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి వెల్లడించారు. జల్పల్లిలో ఎక్కువగా మైనార్టీలు ఉన్నందున వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, మరోకసారి షాహిన్నగర్, ఎరకుంటలో నెల రోజుల్లో జాబ్మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో నిర్వహించిన జాబ్మేళా ద్వారా సుమారు 1800మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. అమెజాన్, మ్యాజిక్ బస్, మైకో మాక్స్, విప్రో, అపోలో ఫార్మాసి, మెడ్ప్లస్, వరుణ్ మోటర్స్, సెంట్రో, యురేకలాంటి ప్రముఖ సంస్థల్లో యువత ఉద్యోగాలు పొందిన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.