వినాయక్నగర్, మార్చి 8 : గతంలో నేరాలకు పాల్పడి లేదా నేర చరిత్ర కలిగి ఉండి జిల్లా నుంచి పారిపోయిన పాత నేరస్తులను గుర్తించడంపై సీపీ సాయిచైతన్య ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకుంటూ, మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే పాత నేరస్తులను పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
నేర చరిత్ర కలిగిన నిందితులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగించారు. తెల్లవారు జామున ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి వచ్చే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాల్లో ప్రయాణం చేసే వారిని లేటెస్ట్ టెక్నాలజీ పరికరాల సహాయంతో పరీక్షించారు. ఇలాంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా పాత నేరస్తులు జిల్లాలోకి ప్రవేశించకుండా కట్టడి చేసే అవకాశం ఉంటుందని, అంతేగాకుండా పాత నేరస్తులు ఎవరైనా ఉంటే వారిని సులువుగా గుర్తించవచ్చని ఎస్హెచ్వో తెలిపారు.