న్యూఢిల్లీ, మార్చి 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చివరిరోజైన మార్చి 31న ప్రభుత్వ ఖాతాల వార్షిక ముగింపు నేపథ్యంలో ఆ రోజు బ్యాంక్లు స్పెషల్ క్లియరింగ్ కార్యలాపాలు నిర్వహిస్తాయని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధిత బ్యాంక్లు జరిపే ప్రభుత్వ లావాదేవీలన్నీ ఇదే ఆర్థిక సంవత్సరపు ఖాతాల్లో నమోదు కావాలని బ్యాంక్లకు ఆర్బీఐ జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 2022 మార్చి 31 రోజున ప్రభుత్వ లావాదేవీలు రిపోర్ట్ అయ్యి, అకౌంట్ కావడానికి తగిన ఏర్పాట్లు జరిగినట్టు ఆర్బీఐ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంక్లన్నీ వాటి సంబంధిత శాఖలు సాధారణ పనివేళల్లో ప్రత్యేక కౌంటర్లు తెరిచేలా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వ చెక్కుల కలెక్షన్ కోసం మార్చి 31న ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం ఆర్బీఐలోని పేమెంట్, సెటిల్మెంట్స్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఆదేశాలు జారీచేస్తుందని పేర్కొంది. ఆ రోజున రాత్రి 12 గంటలవరకూ నెఫ్ట్, ఆర్టీజీఎస్ల ద్వారా లావాదేవీలు కొనసాగుతాయని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. జీఎస్టీ/ఈ-రిసీట్స్ ఫైల్స్ అప్లోడ్ చేయడంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీలను ఆర్బీఐకి రిపోర్ట్ చేయడానికి మార్చి 31నాటి రిపోర్టింగ్ విండో ఏప్రిల్1 మధ్యాహ్నం 12 గంటలవరకూ తెరిచి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఈ ప్రక్రియల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లపై తగిన ప్రచారం చేయాలని పార్టిసిపేటింగ్ బ్యాంక్ల్ని రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది.