అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. సకల సౌకర్యాలు.. సరైన సంపత్తి అందుబాటులో ఉన్నా.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ పట్టలేకపోయాయి. గత కొన్ని సీజన్లుగా యువ శక్తిని నమ్ముకొని ఢిల్లీ ఫర్వాలేదనిపిస్తుండగా.. ఈసారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్.. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసింది. మరి ఇప్పటి వరకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫీ ఈసారైనా ఈ జట్లను వరిస్తుందా చూడాలి!
గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్ చేరుతూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి మరింత జోష్తో లీగ్ కోసం సిద్ధమవుతున్నది. రిషబ్ పంత్ కెప్టెన్సీ.. రికీ పాంటింగ్ కోచింగ్కు వార్నర్, పృథ్వీ షా వంటి ఓపెనింగ్ జతవడంతో ఢిల్లీ బ్యాటింగ్ మరింత పటిష్టంగా కనిపిస్తున్నది. పావెల్, సైఫెర్ట్, మిషెల్ మార్ష్, నోర్జే, ఎంగ్డీ వంటి అంతర్జాతీయ స్టార్లు.. అక్షర్, శార్దూల్, ఖలీల్, చేతన్ సకారియా, కుల్దీప్, విక్కీ ఓస్తాల్, యష్ ధుల్, కేఎస్ భరత్, కమలేశ్, సర్ఫరాజ్ వంటి నాణ్యమైన దేశీయ ఆటగాళ్లు అందుబాటులో ఉన్న ఢిల్లీ ఈ సారి టైటిల్ గెలువాలని తహతహలాడుతున్నది.
పేరు మార్చుకున్నా రాత మాత్రం మారని పంజాబ్ కింగ్స్ ఈసారి జట్టును పూర్తిగా మార్చేసింది. ప్రధాన ఆటగాళ్లను వేలానికి వదిలేసిన ఫ్రాంచైజీ.. మయాంక్ అగర్వాల్ను కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. శిఖర్ ధవన్, బెయిర్స్టో, లివింగ్స్టోన్, షారుక్ ఖాన్ వంటి హిట్టర్లపై నమ్మకముంచిన కింగ్స్.. అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో తొలి టైటిల్ పట్టాలని చూస్తున్నది. ఎనిమిదేండ్ల క్రితం ఫైనల్ చేరడం తప్ప ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చని పంజాబ్.. పాత రికార్డులు చెరిపి వేసేందుకు ఇప్పటికే ప్రాక్టీస్లో నిమగ్నమైంది.