నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. వారం రోజులుగా దశల వారీగా కేంద్రాలు తెరుచుకుంటున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు, అధికారులు ప్రారంభిస్తున్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని లింగాపూర్ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మాక్లూర్ మండలం వెంకటాపూర్లో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడ్మి, బీర్కూర్, నస్రుల్లాబాద్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూర్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరి, పెంబర్తి, గంటూర్పల్లి, నాగారం గ్రామాల్లో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్కుమార్ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్, కనగర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సిరిసిల్ల మండలం చిన్నబోనాలలో, తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లిలో, గండిలచ్చపేట, అంకిరెడ్డిపేటలో స్థానిక ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుండటం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.