నిజామాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు.
జిల్లాలోని బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ముందుగా పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..హరితహారం అనేది సీఎం కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమం అన్నారు.
ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో అటవీ శాతం పెరిగిందన్నారు. చెట్లు మానవ మనుగడకు మూలాధారం. ప్రకృతి దేవుని వరం. ప్రకృతిని ధ్వంసం చేయకూడదన్నారు. ప్రకృతిని కాపాడుకుని ముందు తరాలకు అందించాలని స్పీకర్ సూచించారు. ప్రకృతిని మనం కాపాడితే, ఆ ప్రకృతి మనలను కాపాడుతుందన్నారు.
ప్రతి గ్రామంలో మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి తోడుగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ పిలుపులో భాగంగా రాష్ట్రంతో పాటుగా దేశ విదేశాలలో కూడా పెద్ద ఎత్తున మొక్కలను నాటుతున్నారు.
రాష్ట్రంలోని 12,751 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు.
అనారోగ్యం సమస్యలు ఉన్న వారు గ్రామంలోని ప్రకృతి వనాలలో కూచుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడంతో ఆరోగ్యం బాగుపడుతుందని తెలిపారు.
ప్రతి ఒక్కరు తమ జన్మదినం సందర్భంగా మొక్కలను నాటాలి. గ్రీన్ ఇండియా చాలెంజ్ఇదో గొప్ప యజ్ఞం. అందరు ఉద్యమంలా ఇందులో పాల్గొనాలని స్పీకర్ పిలుపునిచ్చారు.