లక్నో: అక్రమాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారి దౌర్జన్యానికి దిగారు. బీజేపీ తరుఫున ఎన్నికల్లో నిలబడిన తన భర్తకు ఓటేయాలంటూ ప్రజలను బెదిరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ఇటీవల వెలుగుచూసింది. లక్నో పరిధిలో ఐజీగా పనిచేస్తున్న లక్ష్మీసింగ్ భర్త రాజేశ్వర్సింగ్ బీజేపీ తరఫున లక్నోలోని సరోజినీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి బీజేపీకి వ్యతిరేకత ఎదురవుతుండటంతో భర్త గెలుపు కోసం ఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. తన భర్తకు ఓటేయాలంటూ స్థానిక ఓటర్లపై ఒత్తిడి తీసుకొస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీనిపై సమాజ్వాదీ పార్టీ ఈసీకి సోమవారం ఫిర్యాదు చేసింది. ఐజీ వైఖరిపై ఇదివరకే ఫిర్యాదు చేశామని, అయినా ఇంకా చర్యలు తీసుకోలేదని ఎస్పీ వర్గాలు తెలిపాయి. సరోజినీనగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23న పోలింగ్ జరుగనున్నది.