న్యూఢిల్లీ : ఈ నెల 26 నాటి నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడుతాయని భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభవుతాయని పేర్కొంది. వాయువ్య భారతంలో నైరుతి ఉపసంహరణ కాస్త ఆలస్యంగా ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బరిపడా, మల్కాన్గిరి, నల్లగొండ, బాగల్కోట్, వెంగుర్లా మీదుగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సాగుతుందని వివరించింది. రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పింది.
ఈశాన్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర బంగాళాఖాతంలో పూర్తిగా, బెంగాల్, ఒడిశాలోని మిగతా ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలోని పలు ప్రాంతాలు, గోవా అంతటా, అరేబియా సముద్రంలోని మధ్య ప్రాంతం నుంచి రుతుపవనాల ఉప సంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఏర్పడుతున్నాయని పేర్కొంది. ఈ నెల 26 వరకు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వీడేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ పేర్కొంది.
ఈశాన్య గాలులు బంగాళాఖాతం, దక్షిణ దక్షిణ ద్వీపకల్పంలోని దిగువ ట్రోపోస్పియర్ స్థాయిలోకి ప్రవేశించడంతో పాటు ఈశాన్య రుతుపవనాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. తమిళనాడు, కేరళలోని కొన్ని భాగాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ అక్టోబర్ 6న మొదలైందని తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సాధారణంగా దేశంలోని వాయువ్య ప్రాంతంలో సెప్టెంబర్ 17న ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి అక్టోబర్ 6కు జరిగిందని ఐఎండీ తెలిపింది. దేశాన్ని రుతుపవనాలు ఆలస్యంగా వీడడం 1975 తర్వాత రెండోసారి. ఇంతకు ముందు 2019లో వాయువ్య భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ అక్టోబర్ 9న ప్రారంభమైందని ఐఎండీ వివరించింది.