న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇవాళ లోక్సభలో రగడ చెలరేగింది. జీరో అవర్లో ఈ అంశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో కోత్ విధించారని ఆమె ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో ఆ పథకానికి చెందిన నెగటివ్ బ్యాలెన్స్ ఉందన్నారు. సుమారు 5000 కోట్ల పేమెంట్స్ బాకీపడినట్లు ఆమె తెలిపారు. కోవిడ్ మహామ్మారి వేళ ఎంతో మందిని ఆ పథకం ఆదుకున్నదని, దానికి కావాల్సినన్ని నిధులను కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. సోనియా ఆరోపణలకు తొలుత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఉపాధి పథకాన్ని సోనియా రాజకీయం చేస్తోందన్నారు. సోనియా చేసిన వ్యాఖ్యలు సత్యదూరం అన్నారు. 2013-14 సంవత్సరంలో ఉపాధి హామీకి 33 వేల కోట్లు కేటాయించారని, కానీ తమ ప్రభుత్వం 1.12 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు.
2020తో పోలిస్తే ఉపాధి హామీ స్కీమ్కు 35 శాతం తక్కువ నిధులను కేటాయించినట్లు సోనియా ఆరోపించారు. నిధులను సరైన సమయంలో రిలీజ్ చేయకపోవడంతో.. బానిసత్వం పెరిగిపోతోందని ఆమె అన్నారు. ఉపాధి నిధుల పర్యవేక్షణకు లోక్పాల్ నియామకం తప్పనిసరి అన్నారు. పని పూర్తి చేసిన 15 రోజుల్లోనే కార్మికులకు పేమెంట్ ఇవ్వాలని సోనియా డిమాండ్ చేశారు. సోనియా వ్యాఖ్యలకు మరో మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి జరిగిందన్నారు. జన్ధన్ అకౌంట్లకే నేరుగా పేమెంట్స్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. గిరిరాజ్, అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలపుతూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళన వ్యక్తం చేశారు.