Congress : రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కీలక భేటీ నిర్వహించనుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ సమావేశం ద్వారా సీనియర్ నేతలతో సమాలోచనలు జరుపనున్నారు. ఈ కీలక సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌధరి, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, ఆనంద్ శర్మ, జైరాం రమేశ్ తదితరులు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలతో పాటు మరిన్ని విషయాలపై ఈ కీలక సమావేశం సమాలోచనలు జరుపుతుంది.
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. మొదటి విడత ఫిబ్రవరి 11న ముగుస్తాయి. ఇక రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 న ప్రారంభమవుతాయి.