న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో వరుసగా మూడవ రోజు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆమె ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. అయితే మనీల్యాండరింగ్ కేసులో సోనియాకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేయలేదు. ఒకవేళ ఈ కేసులో విచారణ జరపాలనుకుంటే, ఈడీ మళ్లీ సోనియాకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది. మంగళవారం రోజున ఆరు గంటల పాటు ఈడీ సోనియాను విచారించింది.
సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు ఇవాళ ధర్నా చేపట్టారు. విజయ్ చౌక్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న 65 మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మణికమ్ ఠాగూర్ తెలిపారు. బలవంతంగా తమను లాక్కెళ్లుతున్నట్లు సచిన్ పైలట్ ఆరోపించారు. పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీలు నిరసన ర్యాలీ తీశారు.
మూడు రోజుల నుంచి సోనియా సుమారు 12 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆమెను వందకుపైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. 75 ఏళ్ల సోనియా మూడవ రోజున ఈడీ ఆఫీసులో మూడు గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. మంగళవారం ఆరుగంటలు విచారణను ఎదుర్కోగా, ఆమె చాలా వేగంగా సమాధానాలు ఇచ్చినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇదే కేసులో సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ కూడా విచారణను ఎదుర్కొన్నారు. రాహుల్ను 5 రోజుల పాటు విచారించి, సుమారు 150 ప్రశ్నలు వేశారు.