కుత్బుల్లాపూర్, నవంబర్ 10 : దూలపల్లిలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీనివాస్, పైడమ్మ(40) దంపతులు బహదూర్పల్లి ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నారు. వీరికి కుమారుడు కాళీ కృష్ణ (22), కూతురు శ్రీవల్లి (18) ఉన్నారు. అపురూపకాలనీలో కుమారుడు, కూతురు, తల్లి పైడమ్మ వేర్వురు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే విధులు ముగించుకుని కృష్ణ, తన తల్లితో పాటు చెల్లెను తీసుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యలోని దూలపల్లి ఫారెస్టు అకాడమీ వద్ద మైసమ్మగూడ నుంచి దూలపల్లికి వస్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, కృష్ణకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైకులు ఢీకొని మరొకరు..
ఘట్కేసర్, నవంబర్10: ఘట్కేసర్లోని అంబేద్కనగర్ పోచమ్మ దేవాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. బైక్పై రాజు, గోవింద్, నర్సింహ వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపారు.