విజయవాడ: ఉద్యోగులకు తగిన పీఆర్సీ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తుండటాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతుగా నిలుస్తుందని నినదించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరై ప్రసంగించారు.
ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నదని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని సోము వీర్రాజు అన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం రోడ్లపైకి తెచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పీఆర్సీ జీఓలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆదాయ వనరులన్నీ అధికార పార్టీకి చేరాయని సోము వీర్రాజు ఆక్షేపించారు.
సీఎం జగన్ అన్ని వ్యవస్థలను, సంస్థలను నాశనం చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కేవలం మైనింగ్, మద్యం వ్యాపారాలు లాభాల్లో నడుస్తున్నాయని దుయ్యబట్టారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్న వారిపై కేసులు పెట్టకపోవడంలో ఆంతర్యమేంటని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని శాఖల మంత్రి అయ్యారంటూ ఎద్దేవా చేశారు.