ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల్లో కొందరిని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ తమ పార్టీ అభ్యర్థులను బీజేపీ బెదిరిస్తున్నదని అన్నారు. తమను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు సమయానికి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ శివసేన అభ్యర్థుల నామినేషన్ సస్పెండ్ చేశారని సంజయ్ రౌత్ ఆరోపించారు. దీనిపై చర్య తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి సిద్ధంగా లేరని, ఆయన ఒత్తిడిలో ఉన్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాను ఢిల్లీలో ఈసీని కలుస్తానని మీడియాతో అన్నారు.
కాగా, ఇప్పటి వరకు మహారాష్ట్రకే పరిమితమైన శివసేన తొలిసారి ఆ రాష్ట్రం బయట ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగాను, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నది.