వికారాబాద్, నవంబర్ 26 : వికారాబాద్ రైల్వే స్టేషన్ను శుక్రవారం మధ్యాహ్నం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సందర్శించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైల్వే క్వార్టర్స్లో చిన్న పిల్లల పార్కులను పరిశీలించి మొక్కలు నాటారు. గ్యాంగ్రూమ్, విశ్రాంతి గదులను ప్రారంభించారు. రైల్వే సిబ్బంది తమ సమస్యలను జీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మూసీ నది బ్రిడ్జి దగ్గర నుంచి లింక్రోడ్, మూడో ప్లాట్ ఫామ్ వద్ద నూతన టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రైల్వేస్టేషన్లో వయో వృద్ధులు ఎక్కేందుకు లిఫ్ట్, ఆర్యూబీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గంలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని జీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. నవాబుపేట మండలంలో ముబారక్పూర్, చించల్పేట తదితర గ్రామాల్లో రైల్వే సమస్యలు పరిష్కరించాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. నవాబుపేట మండలం గొల్లగూడ, ముభారక్పూర్లలో అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. చించల్పేట వద్ద మూసీ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జికి అనుమతులు ఇవ్వాలని జీఎం దృష్టికి తీసుకొచ్చారు. పులుమామిడి వద్ద రైల్వే గేట్ను ఏర్పాటు చేయాలన్నారు. గొల్లగూడ గ్రామంలో గ్రామ పంచాయతీకి 500 గజాల స్థలాన్ని ఇవ్వాలని జీఎంకు కోరారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం పలు ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపాలని జీఎంకు విన్నవించారు. అదే విధంగా వికారాబాద్ ఆటో డ్రైవర్లు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆటోస్టాండ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. వారి వెంట డీఆర్ఎం ఏకే గుప్తా, రైల్వేస్టేషన్ మాస్టర్ దేవేందర్రావు, అధికారులు ఉన్నారు.
తాండూరు రైల్వేస్టేషన్ను సందర్శించిన జీఎం
తాండూరు, నవంబర్ 26: తాండూరు రైల్వేస్టేషన్ను శుక్రవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్మాల్యా, డివిజినల్ రైల్వే మేనేజర్ అజయ్గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీకాస్ ప్రయోగాలు తుది దశలో ఉన్నాయని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో నిలిచిన రైళ్లు ప్రస్తుతం 70 శాతం నడిపిస్తున్నామని మిగిలిన 30 శాతం రైల్వే సేవలను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రయాణికులు, ఉద్యోగులకు మెరుగైన సేవలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తాండూరు రైల్వే స్టేషన్ బాగుందని అధికారులను మెచ్చుకున్నారు. ఇంకా కావాల్సిన సదుపాయాలు కూడ కల్పిస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు రైల్వే సేవల కోసం ఇచ్చిన ధరఖాస్తులను పరిశీలించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. సికింద్రాబాద్-వాడి వరకు సిగ్నల్స్ వ్యవస్థతో పాటు బ్రిడ్జి నిర్మాణం, పలు రైల్వే మరమ్మతులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురిస్కరించుకొని ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.