హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ధరణి వెబ్సైట్లో నిషేధిత జాబితాలో చేరిన భూముల సమస్య పరిష్కారంపై సర్కారు దృష్టి సారించింది. రైతుల దరఖాస్తులతో సంబంధం లేకుండా గ్రామాలవారీగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల రికార్డులను పరిశీలించి డిసెంబర్లోగా ఆ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ప్రత్యేక ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. సాఫ్ట్వేర్లో ఎదురవుతున్న సాంకేతిక లోపాలు, క్యాడ్, రెవెన్యూ శాఖల డాటా విలీనం, ప్రభుత్వం వివిధ అవసరాల కోసం సేకరించిన భూమిని ఆయా సర్వేనంబర్ల నుంచి మినహాయించకపోవడం తదితర కారణాల వల్ల పలు గ్రామాల్లో చాలామంది రైతుల భూములు నిషేధిత జాబితాలో చేరిపోయాయి. దీంతో వాటి క్రయవిక్రయాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులలో అత్యధికంగా ఈ సమస్యలే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం సేకరించిన భూముల క్రయవిక్రయాలు జరుగకుండా వాటిని నిషేధిత జాబితాలో చేరుస్తారు. కానీ సాంకేతిక లోపాల కారణంగా కొన్నిసర్వే నంబర్లు లేదా సదరు రైతుకు చెందిన మొత్తం భూమి నిషేధిత జాబితాలో చేరిపోతున్నది. ఉదాహరణకు ఒక రైతుకు రెండెకరాల భూమి ఉంటే అందులోనుంచి ప్రభుత్వం ప్రజావసరాల కోసం రెండు గుంటలు సేకరించింది. కానీ ఆ భూమిని రైతు రికార్డుల నుంచి తొలగించకపోగా అతనికున్న మొత్తం రెండెకరాల భూమి ధరణి వెబ్సైట్లో నిషేధిత జాబితాలో చేరిపోయింది. ఈ సమస్యపై అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేకంగా విధివిధానాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలవారీగా నిషేధిత భూముల జాబితాను రూపొందించి కలెక్టర్లకు అందించారు. డిసెంబర్ నాటికి ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించినట్టు తెలిసింది.