సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పొదుపుబాట పట్టింది. నెలవారీ ఖర్చు తగ్గించేందుకు సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో సౌర పలకలు (సోలార్ ప్యానెళ్లు) ఏర్పాటు చేసింది. టీఎస్ రెడ్కో సహకారంతో గతేడాది 34 చోట్ల సోలార్ రూప్టాప్ పలకలను బిగించింది. ప్రాథమికంగా ఇప్పటికే రెండు, మూడు కార్యాలయాల్లో జీరో కరెంట్ బిల్లు వస్తుందని.. 14,11,500 యూనిట్ల ఆదా (దాదాపు రూ.1.27 కోట్లు) అయినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది సౌర విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తామన్నారు. గ్రేటర్వ్యాప్తంగా ఎల్ఈడీ లైట్ల బిగింపుతో రూ.300 కోట్ల మేర విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది.