రవీంద్రభారతి, మార్చి 11: దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని విధంగా, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటిపై ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించాలని సారథి కళాకారులకు సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల అవగాహన సదస్సు రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, తెలంగాణ కళాసారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు పేదలు, అర్హులకు అందేలా ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత సారథి కళాకారులు తీసుకోవాలని అన్నారు. ఉద్యమంలో కళాకారులు ఏ విధంగా పనిచేసి, రాష్ట్రం సాధించుకొన్నారో, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కళారూపాల ద్వారా తెలియజేయాలని చెప్పారు. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ మట్టిని ముట్టుకున్నా ఒక కళారూపం వస్తుందని, అలాంటి తెలంగాణను బంగారు తెలంగాణగా తయారుచేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. సారథి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందేలా చైతన్యం పెంచాలని పిలుపునిచ్చారు. గ్రామీణ భాష, యాస, కళాకారులు, రచయితలు వారికి అర్థమయ్యేలా పాటలు, కళారూపాలను సృష్టించాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సూచించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. కళాకారుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అనంతరం సంక్షేమ పథకాలపై కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో సమాచారశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు, 33 జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు.