ఢాకా: మిడిలార్డర్ ప్లేయర్లు ఏంజెలో మాథ్యూస్ (145 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ చండిమల్ (124; 11 ఫోర్లు, ఒక సిక్సర్) శతకాలతో చెలరేగడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 282/5తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 506 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి టెస్టులో 199 పరుగులు చేసిన మాథ్యూస్.. ఈ మ్యాచ్లోనూ భారీ సెంచరీతో కదం తొక్కగా.. అతడికి చండిమల్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఆరో వికెట్కు 199 పరుగులు జోడించడం విశేషం. బంగ్లా బౌలర్లలో షకీబ్ 5, ఇబాదత్ హుసేన్ నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ గురువారం ఆట ముగిసే సమయానికి 34/4 తో నిలిచింది.