హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హేమాహేమీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన నేతలు సైతం పరాజయం పొందారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్ ఓటమి చెందారు.
ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. వీటిలో కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, రేవంత్రెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఈటల రాజేందర్ పోటీచేసిన గజ్వేల్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు. ఇదే బాటలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, రమేశ్రాథోడ్, కృష్ణయాదవ్, మర్రి శశధర్రెడ్డి, రవీంద్రనాయక్ కూడా ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నేతల్లో మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి, షబ్బీర్అలీ, జగ్గారెడ్డి, ఏ చంద్రశేఖర్, పోదెం వీరయ్య, మధుయాష్కీ, రాంరెడ్డి దామోదర్రెడ్డి, సంపత్కుమార్, మైనంపల్లి హనుమంతరావు కూడా ఓటమి చెందారు. బీఆర్ఎస్కు చెందిన నేతల్లో రెడ్యానాయక్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, దాస్యం వినయ్భాస్కర్, దివాకర్రావు, చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రత్యర్థుల చేతిలో పరాజయం పొందారు.