నాటిన మొక్కలు బతికేలా చూడాలి
రైతులతో మమేకమై ధాన్యం కొనాలి
కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ కృష్ణభాస్కర్
కలెక్టరేట్, మార్చి 31: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులను కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో హరితహారం, పల్లె ప్రగతి పనుల పురోగతి, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ‘హరిత వారం’గా నిర్వహించాలని పేర్కొన్నారు. రోడ్ల వెంబడి మూడు వరుసల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆదేశించారు. పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థల ఆవరణలో స్థలం ఉన్న చోట మియావాకీ ప్లాంటేషన్ చేసేలా చూడాలన్నారు. కంపోస్ట్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వైకుంఠథామాలు, పల్లె ప్రకృతి వనాల పురోగతిపై ఆరా తీశారు. రైతులు కల్లాలు వేగవంతంగా నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వేములవాడలో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు చేయాలి
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సుమారు 82వేల మంది రైతుల నుంచి దాదాపు 3.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 330 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ కోసం 41లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన తర్వాతనే టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్లు ఆర్ అంజయ్య, బీ సత్యప్రసాద్, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, డీపీవో రవీందర్, డీఏవో రణధీర్రెడ్డి, పౌరసరఫరాల మేనేజర్ హరికృష్ణ, ఆర్టీవో కొండల్రావు, మార్కెటింగ్ అధికారి శాబొద్దీన్, కమిషనర్ సమ్మయ్య అధికారులు పాల్గొన్నారు.
ఇసుక లారీల రవాణా నియంత్రణకు చర్యలు
జిల్లాలో ఇసుక రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో రెవె న్యూ, పోలీస్, మైనింగ్, టీఎస్-ఎండీసీ శాఖల అధికారులతో జిల్లాలో ఇసుక లారీల రవాణ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. క్వారీల ద్వారా లారీల్లో రోజూ ఉదయం 6నుంచి సాయంత్రం 4.30 గంటల లోపు మాత్రమే ఇసుకను లోడింగ్ చేయాలన్నారు. ఒక లారీకి రోజుకు ఒక ట్రిప్ మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి లారీకి తప్పనిసరిగా జీపీఎస్ అనుసంధానం ఉండాలన్నారు. అధికారులు తనిఖీలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్డీవో శ్రీనివాసరావు, మైనింగ్ ఏడీ సైదులు, టీఎస్ ఎండీసీ ప్రాజెక్టు అధికారి జగన్మోహన్రెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఆర్టీవో కొండల్రావు, తహసీల్దార్లు మల్లారెడ్డి, సదానందం, ఎస్ఐ లక్ష్మారెడ్డి ఉన్నారు.