హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థికవ్యవస్థకు సింగరేణి వెలుగులు పంచుతున్నది. 130 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ నల్లబంగారం సంస్థ తెలంగాణతోపాటు 10 రాష్ర్టాల్లో పరిశ్రమలను జీవనాధారమై నడిపిస్తున్నది. ఆర్థిక పురోభివృద్ధికి ఇంధనమై మండుతున్నది. మనతోపాటు దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో వేల పరిశ్రమలకు సింగరేణి బొగ్గే ఆధారం.
దేశంలో బొగ్గు ఉత్పత్తి సంస్థలు అనేకం ఉన్నప్పటికీ సింగరేణికి ఉన్న గుర్తింపే వేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంస్థ వ్యాపార పరిధి అంతకంతకూ విస్తరిస్తున్నది. గడిచిన ఆరేండ్లలో వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసుకొంటూ ఎవరూ ఊహించని ఎత్తుకు చేరింది. సంస్థ కార్యకలాపాల్లో అతి ముఖ్యమైన బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాలను అవలీలగా దాటుకుంటూ దేశవ్యాప్తంగా రెండువేలకుపైగా పరిశ్రమలకు ఇంధనంగా కీలకమైన పాత్ర పోషిస్తున్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సిమెంట్ పరిశ్రమలు, స్పాంజ్ ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్లు, సిరామిక్స్, ఫార్మా, ఆగ్రో తదితర అనేక రకాల పరిశ్రమలకు సింగరేణి గనుల నుంచే బొగ్గు సరఫరా అవుతున్నది. కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించి లాభదాయకంగా ముందుకు సాగుతున్నది. తెలంగాణతోపాటు మరో 10 రాష్ర్టాల బొగ్గు అవసరాలను సింగరేణి తీరుస్తున్నది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు సింగరేణి బొగ్గు సరఫరా అవుతున్నది.
2019-20 ఆర్థికసంవత్సరంలో సింగరేణి సంస్థ మొత్తం 624.68 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అందులో 45 శాతానికిపైగా (334.11 లక్షల టన్నులు) తెలంగాణ అవసరాలకు ఉపయోగించారు. మిగిలినదాంట్లో ఆంధ్రప్రదేశ్ (100.24 లక్షల టన్నులు), మహారాష్ట్ర (64.78 లక్షల టన్నులు), కర్ణాటక (92.60 లక్షల టన్నులు), తమిళనాడు (15.83 లక్షల టన్నులు) బొగ్గును వినియోగించాయి. ఈ ఏడాది సరఫరాచేసిన బొగ్గులో 85 శాతం థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు వాడారు. మిగిలిన 15 శాతం బొగ్గు ఇతర పరిశ్రమలకు సరఫరా అయ్యింది.