హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సిరులు కురిపించే సింగరేణి బొగ్గు బ్లాకులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలనే కేంద్రం నిర్ణయంపై కార్మికలోకం ఆందోళన బాటపట్టింది. రాజకీయాలకతీతంగా సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కాషాయ పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాలు కోల్బెల్ట్ వ్యాప్తంగా గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మె చేయనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం మొదటి షిఫ్ట్ నుంచి అన్ని సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)తోపాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ సహా.. బీజేపీ అనుబంధ సంఘమైన బీఎంఎస్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుండటం గమనార్హం. ఈ సమ్మెలో సుమారు 40 వేల మందికిపైగా సింగరేణి కార్మికులు, మరో 25 వేల మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
నాలుగు బ్లాకుల వేలం..
నిజానికి సింగరేణి పరిధిలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికే ఇవ్వాలనేది ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే ఆ సంస్థ ఇక్కడ సర్వే లాంటి వాటిని నిర్వహించింది. తమకే కేటాయించాలని సింగరేణి కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పెడచెవిన పెట్టిన కేంద్రం.. కావాలనే కేకే-6, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి, కేవోసీ బ్లాక్-3లను వేలం వేయాలని నిర్ణయించింది. చాలాకాలంగా సింగరేణి సంస్థ ఈ ప్రాంతాల్లో సర్వే చేసింది. కేకే-6లో 70 మిలియన్ టన్నులు, సత్తుపల్లి బ్లాక్-3లో 60 మిలియన్ టన్నులు, శ్రావణపల్లిలో 200 మిలియన్ టన్నులు, కేవోసీ బ్లాక్-3లో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో సీఎంపీడీఐ (కోల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్) కూడా ఈ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని సిఫారసు చేసింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న తమకే కేటాయించాలని, కొత్తగా వేరే కంపెనీలకు కేటాయిస్తే పని చేయలేవని కూడా తమ సిఫారసులో పేర్కొన్నది. అయినా వినకుండా.. కేంద్రం, బొగ్గు మంత్రిత్వ శాఖలు కక్షపూరితంగానే సింగరేణికి కేటాయించకుండా వేలం వేయాలని నిర్ణయించాయి.
సింగరేణికి, కార్మికులకు భారీ నష్టం..
కేంద్రం మొండి వైఖరి కారణంగా.. కార్మికులంతా కలిసికట్టుగా మూడు రోజులపాటు సమ్మెకు దిగడంతో అటు కార్మికులతోపాటు ఇటు సింగరేణికి కూడా భారీ నష్టం వాటిల్లనున్నట్టు అధికారులు అంచనా వేశారు. సమ్మె కాలంలో జీతభత్యాలు చెల్లించరు. కనుక కార్మికులు తమ జీతం రూపంలో సుమారు రూ. 50 కోట్ల వరకు నష్టం పోవాల్సి ఉంటుంది. అలాగే సింగరేణి సంస్థకు కూడా సుమారు రూ.20 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. సమ్మెకు వెళ్లకూడదంటూ సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపినా ఫలించలేదు. బొగ్గు బ్లాకులను మనకు కేటాయించకుండా.. వేలం వేయాలనే కేంద్రం వైఖరి వల్ల సింగరేణి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని కార్మిక సంఘాలు ముక్తకంఠంతో సమ్మెకు దిగాయి.