మన షట్లర్లు విజృంభించడంతో కామన్వెల్త్ క్రీడల చివరి రోజు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు వచ్చి చేరాయి. పదమూడేండ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్లో పసిడి పతకం కైవసం చేసుకోగా.. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ విజేతగా నిలిచాడు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట బంగారు పతకంతో మెరిసింది. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో శరత్ కమల్ స్వర్ణ కాంతులు విరజిమ్మగా.. పురుషుల హాకీ జట్టు ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
ఓవరాల్గా 22 స్వర్ణాలు సహా 61 పతకాలు ఖాతాలో వేసుకున్న భారత్.. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలను నాలుగో స్థానంతో ముగించింది. అత్యధిక పతకాలు అందించే షూటింగ్.. తాజా మెగాటోర్నీలో లేకపోయినా మనవాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. గోల్డ్కోస్ట్ (2018)లో 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్లో అదరగొట్టింది. పురుష అథ్లెట్లు 35 పతకాలు కొల్లగొట్టగా.. మహిళల విభాగంలో 23 మెడల్స్ దక్కాయి. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మూడు పతకాలు వచ్చాయి.
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడలను భారత్ నాలుగో స్థానంతో ముగించింది. బర్మింగ్హామ్ వేదికగా పదకొండు రోజుల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన క్రీడలు సోమవారంతో ముగిశాయి. ఓవరాల్గా 61 పతకాలు (22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు) సాధించిన భారత్ మెడల్స్ టేబుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (178), ఇంగ్లండ్ (176), కెనడా (92) వరుసగా ప్రథమ, ద్విదీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి.
పోటీల చివరి రోజు భారత్ నాలుగు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో స్వర్ణం సాధించగా.. పురుషుల సింగిల్స్లో యువ షట్లర్ లక్ష్యసేన్ పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల డబుల్స్లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం కూడా పసిడి కాంతులు విరజిమ్మింది. ఇక టేబుల్ టెన్నిస్ (టీటీ)లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజతో కలిసి మిక్స్డ్ డబుల్స్ స్వర్ణం నెగ్గిన వెటరన్ ప్యాడ్లర్ శరత్ కమల్.. పురుషుల సింగిల్స్లో సేమ్ సీన్ రిపీట్ చేశాడు.
భారీ అంచనాల మధ్య ఫైనల్ బరిలోకి దిగిన పురుషుల హాకీ జట్టు.. రజతంతో సరిపెట్టుకోగా.. బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి-త్రిసా జాలీ జోడీ కాంస్యం నెగ్గింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన బాక్సింగ్ పోటీల్లో సాగర్ సిల్వర్ మెడల్ చేజిక్కించుకోగా.. టీటీ పురుషుల సింగిల్స్లో సాతియాన్ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. గోల్డ్కోస్ట్ (2018) కామన్వెల్త్ క్రీడల్లో 66 పతకాలు (26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు) సాధించి మూడో స్థానంలో నిలిచిన భారత్.. తాజా క్రీడల్లో నాలుగో స్థానంతో ముగించింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అథ్లెట్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా అభినందించారు.
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట పసిడి పతకంతో మెరిసింది. టీమ్ ఈవెంట్లో రజతంతో సరిపెట్టుకున్న భారత షట్లర్లు సోమవారం ఫుల్ జోష్ కనబర్చగా.. అప్పటికే సింధు, లక్ష్యసేన్ స్వర్ణాలు సాధించిన దశలో ఈ జంట హ్యాట్రిక్ ఖాయం చేసింది. తుది పోరులో సాత్విక్-చిరాగ్ జోడీ 21-15, 21-13తో బెన్ లాన్-సీన్ మెండీ (ఇంగ్లండ్) ద్వయంపై గెలుపొందింది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో మనవాళ్లు విశ్వరూపం కనబర్చారు. టీమ్ ఈవెంట్లో భారత జట్టు రజతం కైవసం చేసుకోగా.. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ, పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ కాంస్యాలు దక్కించుకున్నారు. ఓవరాల్గా బర్మింగ్హామ్ క్రీడల్లో మన షట్లర్లు 6 పతకాలు (3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు) ఖాతాలో వేసుకున్నారు.
టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో శరత్ కమల్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఇటీవలే 40వ పడిలోకి అడుగుపెట్టిన శరత్.. వయసు ఒక సంఖ్య మాతమ్రే అని మరోసారి నిరూపించాడు. 2006లో తొలిసారి కామన్వెల్త్ పురుషుల సింగిల్స్లో పసిడి వెలుగులు విరజిమ్మిన శరత్.. మళ్లీ 16 ఏండ్ల తర్వాత స్వర్ణ పతకం చేజిక్కించుకున్నాడు. తాజా క్రీడల్లో ఇప్పటికే టీమ్ ఈవెంట్తో పాటు మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజతో కలిసి బంగారు పతకాలు నెగ్గిన శరత్.. మూడో స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్గా కామన్వెల్త్ క్రీడల్లో శరత్కు ఇది 13వ పతకం కావడం విశేషం. సోమవారం తుదిపోరులో శరత్ 4-1 (11-13, 11-7, 11-2, 11-6, 11-8)తో లియామ్ పిచ్ఫోర్డ్ (ఇంగ్లండ్)పై గెలిచి టాప్ ప్లేస్ చేజిక్కించుకున్నాడు. తొలి గేమ్ కోల్పోయి ఒత్తిడిలో కనిపించిన శరత్ ఆ తర్వాత విజృంభించాడు. వరుస పాయింట్లు సాధిస్తూ వెనుదిరిగి చూసుకోకుండా దూసుకెళ్లాడు. లాంగ్ ర్యాలీలు ఆడుతూ.. ప్రత్యర్థిని తికమక పెట్టడంతో పాటు బ్యాక్హ్యాండ్ షాట్లతో విన్నర్లు సంధించి విజేతగా నిలిచాడు.
పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో సాతియాన్ జ్ఞానశేఖరన్ సత్తాచాటాడు. సోమవారం పోరులో సాతియాన్ 4-3 (11-9, 11-3, 11-5, 8-11, 9-11, 10-12, 11-9)తో పాల్ డ్రింక్హాల్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. తొలి మూడు గేమ్లు గెలిచిన సాతియాన్.. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్లు కోల్పయి ఆందోళన రేకెత్తించినా.. నిర్ణయాత్మక ఆఖరి పోరులో దుమ్మురేపడంతో పతకం చేజిక్కింది. సింగిల్స్లో సాతియాన్కు ఇదే తొలి కామన్వెల్త్ పతకం కాగా.. ఓవరాల్గా ఆరోది. బర్మింగ్హామ్ క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు 7 పతకాలు (4 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు) సాధించారు.
భారత యువ బాక్సర్ సాగర్ అహ్లావత్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం సొంతం చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోటీల్లో పురుషుల ప్లస్ 92 కేజీల విభాగం ఫైనల్లో సాగర్ 0-5తో డిలీసియస్ ఓరీ (ఇంగ్లండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మెగాటోర్నీ ఆరంభం నుంచి చక్కటి ప్రదర్శన కనబర్చిన 20 ఏండ్ల సాగర్.. తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయాడు. 2015లో ‘ఫైట్ ఆఫ్ ది సెంచరీ’గా చరిత్రకెక్కిన ఫ్లయిడ్ మావెదర్, పకియావో మధ్య జరిగిన బౌట్ వార్తలను పత్రికల్లో చదివి బాక్సింగ్ వైపు మళ్లిన సాగర్.. అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పతకంతో సత్తాచాటాడు. ఓవరాల్గా బాక్సింగ్లో మనవాళ్లు ఏడు పతకాలు (3 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు) సాధించి బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలను ఘనంగా ముగించారు.
ఒలింపిక్స్లో ఇప్పటికే రెండు పతకాలు సాధించిన తెలుగమ్మాయి సింధు.. కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-15, 21-13తో మిచెల్లె లీ (కెనడా)పై అలవోక విజయం సాధించింది. గతంలో రెండు పతకాలు (2014 కాంస్యం, 2018 రజతం) చేజిక్కించుకున్న సింధు ఈసారి ముందే చెప్పినట్లు పతకం రంగు మార్చింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్ల్లో మ్యాచ్ను ముగించింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న ఈ స్టార్ షట్లర్.. మెరుపు షాట్లతో మైదానాన్ని హోరెత్తించింది.
ఈ పతకం (స్వర్ణం) కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు చేజిక్కడం చాలా ఆనందంగా ఉంది. కామన్వెల్త్ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఒకే జోరు కొనసాగించా. ఒకరి ఆటతీరు మరొకరికి తెలిసి ఉండటంతో ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ విజయాన్ని ఆస్వాదించేందుకు ఆతృతగా ఉన్నా. స్వదేశానికి రాగానే కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలు జరుపుకుంటా. ఆ తర్వాత వరల్డ్ చాంపియన్షిప్ కోసం సిద్ధమవుతా. నా వెంట నిలిచిన వారికి ధన్యవాదాలు. ఫైనల్లో ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. వారిచ్చిన ఉత్సాహంతో మరింత ధాటిగా ఆడగలిగా.
– పీవీ సింధు
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన భారత యువ షట్లర్ లక్ష్యసేన్ పసిడి పతకంతో మెరిశాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్యసేన్ 19-21, 21-9, 21-16తో జె యాంగ్ (మలేషియా)పై విజయం సాధించాడు. గత రెండు మ్యాచ్ల్లో మేటి ఆటగాళ్లను ఓడించి ఫైనల్ చేరిన యాంగ్పై లక్ష్యసేన్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాడు. హోరోహోరీగా సాగిన తొలి గేమ్లో లక్ష్య వంద శాతం కష్టపడ్డా.. కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన యాంగ్ ముందంజ వేశాడు. ఇక పసిడి పట్టాలంటే మిగిలిన రెండు గేమ్లు తప్పక గెలువాల్సిన స్థితిలో లక్ష్య విశ్వరూపం కనబర్చాడు. సుదీర్ఘ ర్యాలీలు, పదునైన స్మాష్లతో ప్రత్యర్థిని చిత్తు చేస్తూ సునాయాసంగా రెండో గేమ్ను చేజిక్కించుకున్నాడు. ఇక మూడో పోరులో ప్రత్యర్థి దీటుగా బదులిచ్చినా.. ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా విజయతీరాలకు చేరాడు.
కామన్వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలు సాధిస్తున్న మన్ప్రీత్ సేన.. సోమవారం బర్మింగ్హామ్లో జరిగిన ఫైనల్లో నిరాశ పరిచింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఒత్తిడిలో కనిపించిన భారత ప్లేయర్లు.. ఆసీస్కు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోవడంతో చివరకు 0-7తో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. అందుకు తగ్గ ఆటతీరు కనబర్చగా.. వరుస విజయాలతో ఫైనల్కు చేరిన మనవాళ్లు.. తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయారు. 1998 క్రీడల నుంచి కామన్వెల్త్ హాకీలో ఆస్ట్రేలియా వరుసగా స్వర్ణాలు సాధిస్తూ వస్తున్నది.