లక్నో: సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 11-21, 21-12, 21-17 తేడాతో సుపనిద కాతెతింగ్(థాయ్లాండ్)పై విజయం సాధించింది. గంటా ఐదు నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఆకట్టుకుంది. సెమీస్లో రష్యాకు చెందిన ఎవ్జెనియా కోస్తెకయాతో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రణయ్ 19-21, 16-21 తేడాతో ఆర్నార్డ్ మెర్కలె(ఫ్రాన్స్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరో క్వార్టర్స్లో మిథున్ మంజునాథ్ 11-21, 21-12, 21-18తో సెర్గె సిరాంట్(రష్యా)పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించాడు.