న్యూఢిల్లీ : భారత్లో గుండె జబ్బులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్లో రెండు మూడు రెట్లు అధికంగా గుండె పోటు కేసులు నమోదవుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో 60 ఏండ్లు దాటిన వారిలో గుండె పోటు ఘటనలు చోటుచేసుకుంటుండగా భారత్లో 50, 40 ఏండ్ల వయసులోనే హృద్రోగాలు వెంటాడుతున్నాయని ఫోర్టిస్ హాస్పిటల్ వసంత్కుంజ్ హెడ్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ తపన్ ఘోష్ చెప్పారు.
స్మోకింగ్, డయాబెటిస్, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి పలు కారణాలు హృద్రోగాలకు కారణమని తెలిపారు. గుండెపోటు ముప్పు కారకాలను గమనిస్తూ జీవన శైలి మార్పులు చేసుకుంటే భారత్లో గుండె జబ్బులను నివారించవచ్చని చెప్పారు.
ముఖ్యంగా అదిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోవడంతో పాటు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలని డాక్టర్ ఘోష్ చెప్పారు. చెడు కొలెస్ట్రాల్గా వ్యవహరించే ఎల్డీఎల్ను 100లోపు ఉండేలా చూసుకోవాలి. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు మనసుకు ఆహ్లాదం కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనాలి. ముఖ్యంగా మద్యపానం, ధూమపానాన్ని పూర్తిగా విడిచిపెట్టడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పారు.