Warangal | హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ సర్కార్ మొండిచెయ్యి చూపించింది. పీఎం మిత్ర పథకం కింద వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)కు కేంద్ర ప్రభుత్వం బ్రౌన్ఫీల్డ్ హోదాతో సరిపెట్టింది. కేఎంటీపీకి గ్రీన్ఫిల్డ్ హోదా అవకాశమున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టింది. దీంతో రాష్ర్టానికి రూ.300 కోట్ల నష్టం వాటిల్లింది. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పార్క్లను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ..2020-21లో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అప్పెరల్(పీఎం మిత్ర) పథకానికి శ్రీకారం చుట్టారు. దీంట్లోభాగంగా ఎంపికైన టెక్స్టైల్ పార్క్ల్లో గ్రీన్ఫీల్డ్ హోదా లభించిన పార్క్లకు రూ.500 కోట్లు, బ్రౌన్ఫీల్డ్ హోదా కలిగిన పార్క్లకు రూ.200 కోట్ల నిధులు గ్రాంట్గా లభించనున్నాయి. కేఎంటీపీకి గ్రీన్ఫీల్డ్ హోదా ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ తీవ్రంగా కృషి చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై మౌనం వహించింది. ఈ పథకం కింద 13 రాష్ర్టాల నుంచి 18 ప్రతిపాదనలు రాగా, వీటిలో తెలంగాణతో సహా ఏడు రాష్ర్టాలు ఎంపికయ్యాయి.
తెలంగాణ రాష్ర్టాన్ని వస్త్ర పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ కేఎంటీపీని అభివృద్ధి చేయడానికి భారీగా నిధులు కేటాయించారు. 2017 అక్టోబర్లోనే సుమారు 1,200 ఎకరాల స్థలంలోనే కేఎంటీపీకి శ్రీకారం చుట్టి, దశలవారీగా రూ.500 కోట్లతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. కేంద్ర సర్కార్ ఒక్క పైసా సాయం చేయకున్నప్పటికీ అంతర్గత రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాలను అప్పటి సర్కార్ ఏర్పాటు చేసింది.