మాన్సా: పంజాబీ పాపులర్ సింగర్ సిద్దూ మూసేవాలాను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 302, 307, 341 సెక్షన్ల కింద ఈ కేసును బుక్ చేశారు. ఆర్మ్స్ యాక్ట్లోని 25, 27 సెక్షన్లను కూడా బుక్ చేశాడు. సిద్ధూ కారును వెంబడిస్తూ రెండు కార్లు వెళ్లినట్లు సీసీటీవీ ఫూటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
సిద్ధూ మూసేవాలాను తానే హత్య చేసినట్లు కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం ఫేస్బుక్లో దీనికి సంబంధించిన ఓ పోస్టు చేశాడతను. గ్యాంగ్లీడర్ లారెన్స్ బిష్ణోయ్కు మిత్రుడు గోల్డీ బ్రార్. సింగర్ సిద్దూ మర్డర్లో ఈ ఇద్దరి పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇటీవల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్లాల్ సింగ్ పెహాల్వాన్ హత్య కేసులో బ్రార్ నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో అతనికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
సిద్దూ మూసేవాలా ఇంటి ముందు భారీ భద్రతను పంజాబ్ పోలీసులు ఏర్పాటు చేశారు. గ్యాంగ్వార్ వల్ల అతను హత్యకు గురైనట్లు పంజాబీ పోలీసులు అనుమానిస్తున్నారు. మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పిస్తోల్తో సింగర్ సిద్దూను కాల్చిచంపారు. అయితే పంజాబ్ ప్రభుత్వం 424 మంది వీఐపీలకు భద్రతను వెనక్కి తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం వివాదాస్పదమైంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సింగర్ సిద్దూ పోటీ చేశాడు. మాన్సా సీటు నుంచి అతను బరిలోకి దిగాడు. కానీ ఆప్ అభ్యర్తి విజయ్ సింగ్లా చేతిలో అతను ఓడిపోయాడు. ఇటీవల అవినీతి కేసులో మంత్రి విజయ్ సింగ్లాను క్యాబినెట్ నుంచి సీఎం భగవంత్ మాన్ సింగ్ తొలగించిన విషయం తెలిసిందే.
హత్య జరిగిన ప్రదేశం నుంచి డంప్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. క్రైమ్ స్పాట్కు కిలోమీటర్ దూరంలో ఉన్న సుమారు లక్ష మొబైల్ ఫోన్ నెంబర్ల కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.