“తెలుసుకదా’ సినిమా విషయంలో రైటర్గా నాకో భయం ఉండేది. ప్రతీ సీన్లో పంచులు లేకపోతే ప్రేక్షకుల్ని మెప్పిస్తామా? లేదా? అని సందేహించాను. కానీ ఈ రోజు భయం పోయింది. విమల్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశా. హౌస్ఫుల్ అయింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా సినిమాను తీర్చిదిద్దాం. ఈ దీపావళిని ఆనందభరితం చేసే సకుటుంబ కథా చిత్రమిది’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘తెలుసుకదా’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఈ సినిమాలో తాము చెప్పిన పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని, విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నదని దర్శకురాలు నీరజ కోన తెలిపారు. క్లాస్తో పాటు మాస్ ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా ఆకట్టుకుంటున్నదని వైవా హర్ష పేర్కొన్నారు.