సిద్దిపేట, జనవరి 14: స్వచ్ఛ భారత్లో సిద్దిపేట జిల్లా మెరుగైన స్థానంలో నిలిచిందని జల్శక్తి మంత్రిత్వ శాఖ (తాగునీరు, పారిశుద్ధ్య విభాగం) అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోక ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్-2లో భాగంగా దేశవ్యాప్తంగా సంపూర్ణ స్వచ్ఛత సాధించడానికి సిద్దిపేట జిల్లా పనితీరు ప్రేరణ కల్పిస్తున్నదని కొనియాడారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగాల్లో సిద్దిపేట జిల్లా రానున్న రోజుల్లో మంచి పనితీరును కనబరుస్తూ దేశంలోని మిగతా జిల్లాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటూ గురువారం ఆయన ఓ లేఖ పంపారు. స్వచ్ఛ ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవ్-2021లో భాగంగా జిల్లా సాధించిన ప్రగతిని, ఫలితాలను తెలుపుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పర్యవేక్షణలో 160కిపైగా చిత్రాలను రూపొందించి, స్వచ్ఛ మిషన్ లఘు చిత్రాల పోటీకి పంపించారు. వీటిని వీక్షించిన ఆయన మెరుగైన పరితీరును అభినందిస్తూ లేఖ రాశారు. కేంద్రం నుంచి ప్రశంసలు రావడంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బందిని కోరారు. కలెక్టర్ హనుమంతరావు సైతం అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.