సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట గాంధీ పార్కులో సిద్దిపేట తొలి శాసన సభ్యుడు ఎడ్ల గురువారెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి మందపవన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల గురువారెడ్డి తనయుడు వెంకటామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేట తొలి శాసనసభ సభ్యుడు గురువారెడ్డి విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురువారెడ్డిది గొప్ప చరిత్ర అన్నారు. సిద్దిపేటకు మొదట కరెంట్ తీసుకొచ్చిన నాయకుడు అని తెలిపారు. ఆ రోజుల్లో విలువలతో కూడిన రాజకీయాలు ఉండేవన్నారు. సిద్దిపేటది ఉద్యమాల చరిత్ర. తొలి, మలి విడత తెలంగాణ పోరాటాలకు దిక్సూచి సిద్దిపేట అన్నారు.
గురువారెడ్డిని చాలా సందర్భాల్లో కలవడం జరిగిందన్నారు. తన చివరి రోజుల్లో తెలంగాణకు సంపూర్ణ మద్దతును ప్రకటించిన వ్యక్తి. పెన్షన్ డబ్బులతో విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేసిన వ్యక్తి అన్నారు. త్వరలో మాజీ మంత్రి మదన్ మోహన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. మనం చేసిన మంచి పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయని.. మంచి మార్గంలో నడుస్తూ యువతకు మంచి మార్గదర్శనం చేయాలని హరీశ్రావు పేర్కొన్నారు.