స్వచ్ఛ సర్వేక్షణ్-2022కు పోటీ ప్రారంభమైంది. స్వచ్ఛతను పాటిస్తున్న మున్సిపాలిటీలను గుర్తించి జాతీయ స్థాయిలో ఈ అవార్డును అందజేస్తారు. గతంలో నిర్వహించిన సర్వేలో సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలు ర్యాంకుల్లో వెనకబడ్డాయి. ప్రస్తుతం ఆ మూడు ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 50వేలలోపు జనాభా ఉన్న విభాగంలో ఈసారి మంచి ర్యాంకుల కోసం అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు విశేష కృషి చేస్తున్నారు. పారిశుధ్యం, చెత్త పునరుత్పత్తి, పచ్చదనం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంపై అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లు, అధికారులు, ప్రజలు ఈ ర్యాలీలతో అవగాహన కల్పిస్తున్నారు. బొల్లారం మున్సిపాలిటీలో బిగ్బాస్ ఫేం అరియానా గ్లోరీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుని పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా అన్ని మున్సిపాలిటీల్లో సేవలు పెంచి సంపూర్ణ పారిశుధ్యం అమలుకు కృషి చేస్తున్నారు. వివిధ శాఖలనుంచి మెరుగైన ర్యాంకింగ్ కోసం సర్టిఫికెట్లు తీసుకోవడంతో పాటు ప్రజలు మున్సిపాలిటీ పారిశుధ్య సేవలపై ఓటు వేసేలా ప్రచారం చేస్తున్నారు. సిటిజన్ బుడ్డి యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మున్సిపాలిటీ నుంచి పొందుతున్న సేవలకు ర్యాంకింగ్ ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. చేస్తున్న సేవలు చూసి ఓటేయాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ర్టానికి జాతీయస్థాయిలో స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డులో రెండో స్థానం దక్కడం మున్సిపాలిటీల్లో జోష్ నింపి మరింత బాధ్యతను పెంచింది. ఈ పారిశుధ్య పోటీ ప్రజలకు నాణ్యమైన సేవలు, మంచి ఆరోగ్యం అందజేస్తుంది.
అది అమీన్పూర్ చెత్త డంపింగ్యార్డు.. ఉదయం 10 గంటల లోపు దాదాపు 30 మెట్రిక్ టన్నుల చెత్త వివిధ వాహనాల్లో తరలివచ్చింది. చెత్త డంపింగ్కు వచ్చిన వాహనాలు చకచకా చెత్తను కుప్పగా పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బంది చకచకా వాటిని వేరుచేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకునే వ్యక్తులు వాటిని సేకరిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి చిన్నమొత్తంలోనే చెత్త ఉత్పత్తి అవుతూ కనిపిస్తుంది. కానీ, వేలాది ఇండ్ల నుంచి వస్తున్న చెత్త, ఇతర వ్యర్థాలు మాత్రం టన్నుల్లో ఉన్నాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీలో రోజుకు 12 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. బొల్లారంలో 16 మెట్రిక్ టన్నుల చెత్త డంప్యార్డుకు చేరుతున్నది. ఎకరాల స్థలాలు ఉన్నా, రోజూ వస్తున్న చెత్తతో సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో చెత్తను పునర్వినియోగించడం పెద్ద సమస్యగా మారుతున్నది. మున్సిపాలిటీలు శక్తిమేర వాటిని తిరిగి ఉపయోగించుకునేలా కార్యాచరణ అమలు చేస్తున్నాయి. మరోపక్క పారిశుధ్య సిబ్బంది తెల్లవారు జామున నుంచి వీధులు శుభ్రం చేయడం, చెత్త డంపింగ్ పాయింట్లను శుభ్రం చేస్తున్నారు. పార్కుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ శుభ్రతకు పాటుపడుతున్నారు. వందలాది పారిశుధ్య సిబ్బంది, వాహనాలు, ఇతర అధికార బృందాలు కష్టపడితేనే పట్టణాలు ఉదయం వరకు శుభ్రంగా కనబడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా పారిశుధ్యం అనేది అతి కీలకమైన అంశంగా మారింది. అన్ని మున్సిపాలిటీలు మొదటి ప్రాధాన్యతగా పారిశుధ్యాన్ని నిర్వహిస్తున్నారు. గుట్టలుగా పోగవుతున్న చెత్తను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన అవసరం అని తెలుసుకున్న మున్సిపాలిటీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పట్టణాల పారిశుభ్రత ఎంత ప్రాధాన్యతతో కూడి ఉందో వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను విడదీసి మున్సిపాలిటీలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కంపోస్టు ఎరువుల తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు. యూజ్అండ్త్రో వస్తువులకంటే తిరిగి వాడేలా ఉండే క్యారీ బ్యాగులు, సామగ్రిని ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులతో పాటు మహిళా సంఘాలు, కాలనీల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ర్యాంకింగ్ ఇలా..
సర్వే సర్వేక్షణ్ 2022లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో పారిశుధ్యం అమలుపై పోటీ పెడుతున్నది. ర్యాంకింగ్ ఇస్తున్నది. మెరుగైన ర్యాంకింగ్కు బహుమతులతో పాటు అవార్డులు, ప్రత్యేక అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. పలు విభాగాల్లో మున్సిపాలిటీ సాధించిన స్థానాలతో పాటు మున్సిపాలిటీ చెత్త సేకరణపై, పారిశుధ్యం అమలుపై పెడుతున్న శ్రద్ధను కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు పరిశీలించి ర్యాంకింగ్ ఖరారు చేస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా స్థానిక మున్సిపాలిటీల్లో నివసిస్తున్న ప్రజలు కూడా సిటిజన్ బడ్డీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ మున్సిపాలిటీకి వివిధ విభాగాల్లో ర్యాంకింగ్ ఇవ్వొచ్చు. వీరి ఓట్లు కీలకం కూడాను. సిటిజన్ బడ్డీ అనే యాప్పై ఓటింగ్ చేసేందుకు మున్సిపాలిటీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జనాభాలో 5శాతం మంది ఓటింగ్ వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమీన్ఫూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీలు దాదాపుగా వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని అగ్రస్థానంలో ఉన్నాయి. పారిశుధ్య సేవల్లోనూ ముందున్నాయి. తడిపొడి చెత్తను సేకరించడంతో పాటు సహజ ఎరువులను తయారు చేసుకునేలా కాలనీవాసులను ప్రోత్సహిస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీలను అందుబాటులోకి తీసుకుని వచ్చి వీధులన్నీ మురుగులేకుండా చేస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం ఈ మూడు మున్సిపాలిటీలకు నిధులు వస్తున్నాయి. దీని ప్రకారమే పారిశుధ్య సిబ్బంది నియామకాలు ఉంటున్నాయి. వాస్తవంగానైతే 2022లో జనాభా రెట్టింపు అయ్యింది. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటంతో జనాభా విపరీతంగా పెరిగింది. వారికి మెరుగైన సేవలు అందాలంటే ఆస్థాయిలో నిధులు అవసరం. వాటితో పాటు పారిశుధ్య సిబ్బంది, ఇతర సేవావిభాగాలు పనిచేయాలి. ప్రజలు మున్సిపాలిటీల్లో నిధుల వరద పారేందుకు తమ మున్సిపాలిటీలకు ఓటింగ్ వేసి మెరుగైన ర్యాంకింగ్ వచ్చేలా చేస్తే భారీగా నిధులు పారుతాయి.
పదిలోపు ర్యాంకింగ్ కోసం కష్టపడుతున్నాం..
అమీన్పూర్ మున్సిపాలిటీకి సర్వే సర్వేక్షణ్లో గతేడాది 73వ ర్యాంకింగ్ వచ్చింది. కొత్త మున్సిపాలిటీ కావడంతో పోటీలో మా గురించి సరైన వివరాలు పొందుపర్చలేక ర్యాంకింగ్లు పొందలేదని భావిస్తున్నాం. 2022 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో ఈ ఏడాది 10లోపు ర్యాంక్ రావాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం సంపూర్ణ సహకారం ఇవ్వడంతో అన్ని విభాగాల్లో సేవలు విస్తరించాం. ప్రజలు ఓటింగ్లో పాల్గొంటే మంచి ర్యాంకింగ్ సాధ్యమవుతున్నది.
తెల్లాపూర్కు మెరుగైన ర్యాంక్ సాధిస్తాం..
తెల్లాపూర్ నూతన మున్సిపాలిటీగా ఉన్న సమయంలోనే లాక్డౌన్లు వచ్చాయి. అన్ని విభాగాలపై పట్టు సాధించే క్రమంలో ర్యాంకింగ్కు సన్నద్ధం కాలేదు. ఈమారు పారిశుధ్యం, మురుగు సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. గతేడాది మాకు జాతీయస్థాయిలో 273వ ర్యాంక్ వచ్చింది. ఈ ఏడాది మా ర్యాంక్ మెరుగవుతుంది. పాలకవర్గం సహకారం, ప్రజల సహకారం బాగుంది.
సేవలతో ఉత్తమ ర్యాంకింగ్ కోసం కృషి
మెరుగైన సేవలను అందజేస్తేనే సర్వే సర్వేక్షణ్-2022లో ఉత్తమ ర్యాం కింగ్ సాధ్యమవుతుందని నమ్ముతు న్నాం. ఆ మేరకు ప్లానింగ్ ప్రకారం పారిశుధ్యం, మురుగు సమస్యలను పరిష్కరిస్తున్నాం. సర్వే సర్వేక్షణ్ గతేడాది ర్యాంకింగ్లో 58వ స్థా నం దక్కింది. ఈ మారు పలు కేటగిరీల్లో మా పనితీరు మెరుగైంది. పారిశుధ్యంపై ప్రజలకు వార్డుల వారీగా అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛ బొల్లారం బ్రాండ్ అంబాసిడర్గా బిగ్బాస్ ఫేం అరియాన గ్లోరీ సేవలందిస్తున్నారు. స్వచ్ఛతపై ఆమె అవగాహన కల్పించి మెరుగైన ర్యాంక్ వచ్చేందుకు దోహదపడుతారు.